హైదరాబాద్: బాల్ టాంపరింగ్కు పాల్పడి దేశం పరువు తీసిన ఆస్ట్రేలియా క్రికెటర్లపై ఆ దేశ బోర్డు నిషేధం విధించింది. కేప్టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్కు పాల్పడిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లు ఆస్ట్రేలియాకు రెండేళ్ల పాటు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా కూడా క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. ఇక, మూడో టెస్టులో బాల్ టాంపరింగ్ చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన కామరూన్ బాన్క్రాఫ్ట్పై 9 నెలల నిషేధం విధించింది.
బాల్ టాంపరింగ్ వివాదాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తేలిగ్గా తీసుకున్నప్పటికీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంది. క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధంపై ఈ ముగ్గురు ఆటగాళ్లు మరోసారి అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది.
BREAKING: David Warner and Steven Smith banned for one year by Cricket Australia. Cameron Bancroft banned for nine months https://t.co/ywUuoNUCjf pic.twitter.com/gLsRZrbGHp
— ESPNcricinfo (@ESPNcricinfo) March 28, 2018
ఇప్పటికే ఈ ముగ్గురు ఆటగాళ్లను దక్షిణాఫ్రికా నుంచి అర్ధాంతరంగా ఇంటికి పంపించివేసింది. వీరి స్థానంలో నాలుగో టెస్టు కోసం రెన్షా, గ్లెన్ మాక్స్వెల్, జో బర్న్స్లు దక్షిణాఫ్రికాకు చేరుకున్నారు. మరోవైపు సిడ్నీకి చేరుకోగానే మీడియా సమావేశంలో ఈ బాల్ టాంపరింగ్ వివాదంపై స్టీవ్ స్మిత్ స్పందించనున్నాడు.
క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లు అధికారికంగా ఐపీఎల్ 11వ సీజన్కు దూరమయ్యారు. అంతేకాదు ఈ నిషేధంతో ఈ ఏడాది చివర్లో ఇండియాతో సొంతగడ్డపై జరిగే సిరీస్లో స్మిత్, వార్నర్ ఆడే అవకాశాన్ని కూడా కోల్పోయారు. కేప్టౌన్ టెస్టులో బాల్ టాంపరింగ్పై జట్టులోని సీనియర్ ఆటగాళ్లందరం కలిసి తీసుకున్న నిర్ణయమని స్మిత్ అంగీకరించిన సంగతి తెలిసిందే.
బాల్ టాంపరింగ్ వివాదం బయటపడ్డ మరుక్షణమే స్మిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించి అతడి స్థానంలో టిమ్ పైన్కు బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకు టిమ్ ఫైన్ పూర్తి స్థాయి కెప్టెన్గా వ్యవహారించనున్నాడు. స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్లకు మాత్రమే ఈ విషయం గురించి తెలుసని సీఏ చేపట్టిన విచారణలో వెల్లడైంది.
దీంతో బాల్ టాంపరింగ్ వివాదంలో మిగతా ఆటగాళ్ల ప్రమేయం ఏమాత్రం లేదని, వారంతా అమాయకులేనని సీఏ సీఈవో జేమ్స్ సదర్లాండ్ ప్రకటించారు. కేప్టౌన్లో విచారణ జరిపి క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ ఇంటెగ్రిటీ లైన్ రాయ్, హై ఫెర్ఫార్మెన్స్ మేనేజర్ పాట్ హోవార్డ్లు ఇచ్చిన ప్రాథమిక నివేదిక అనంతరం సదర్లాండ్ ఈ ప్రకటన చేశాడు.
అయితే విచారణ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో ఈ ముగ్గురిపై ఇప్పుడే చర్యలు తీసుకోలేమని చెప్పాడు. ఇంకో 24 గంటల తర్వాత తుది నివేదిక వస్తుందని.. దాని ఆధారంగా చర్యలు ప్రకటిస్తామని సదర్లాండ్ తెలిపాడు. టాంపరింగ్పై విచారణ కోసం నియమించిన కమిటీ బుధవారం తుది నివేదిక ఇవ్వడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిషేధ నిర్ణయం తీసుకుంది.