హైదరాబాద్: టీ20ల్లో సొంతగడ్డపై టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. ఇన్నాళ్లు స్వదేశంలో రికార్డుల మోత మోగించడమే అలవాటుగా చేసుకున్న కోహ్లీసేనకు గ్లెన్ మ్యాక్స్వెల్ తన సెంచరీతో అడ్డుకట్ట వేశాడు. విరాట్ కోహ్లీ(72 నాటౌట్) దూకుడుతో టీమిండియాకు భారీ స్కోరు సాధించినప్పటికీ... గ్లెన్ మ్యాక్స్వెల్ (113 నాటౌట్) సెంచరీకి ముందు భారీ లక్ష్యం కూడా చిన్నపోయింది. ఫలితంగా బెంగళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో రెండు టీ20ల సిరిస్ను 2-0తో టీమిండియా చేజార్చుకుంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు సాధించింది. అనంతరం 191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 194 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ సిరిస్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆసీస్ బ్యాట్స్మెన్ గ్లెన్ మ్యాక్స్వెల్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'తో పాటు 'మ్యాన్ ఆప్ ద సిరిస్' అవార్డు లభించింది.
India vs Australia: 350 సిక్సులు బాదిన తొలి భారత క్రికెటర్గా ధోని రికార్డు
భారత్-ఆస్ట్రేలియా రెండు టీ20ల సిరిస్లో నమోదైన గణాంకాలు:
* అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికం (20)గా 50+ స్కోర్లు సాధించిన ఆటగాడిగా రోహిత్తో కలిసి టాప్లో నిలిచాడు కోహ్లీ. అలాగే ఎక్కువ ఫోర్లు (223) బాదిన క్రికెటర్గానూ దిల్షాన్తో కలిసి అగ్రస్థానంలో ఉన్నాడు.
* ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలను అందుకున్న తర్వాత భారత జట్టు స్వదేశంలో ఓడిపోయిన తొలి సిరీస్ ఇదే కావడం గమనార్హం. 2014 నుంచి ఇప్పటిదాకా స్వదేశంలో అతను 7 టెస్టు, ఐదు వన్డే, రెండు టీ20 సిరీస్లు గెలిచాడు. ఒక సిరీస్ డ్రా అయింది.
* నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ స్వదేశంలో టీ20 సిరీస్ను కోల్పోయింది. చివరిసారిగా 2015లో దక్షిణాఫ్రికాపై 0-2తో ఓడింది.
* భారత్పై టీ20ల్లో ఆస్ట్రేలియాకు ఇదే తొలి సిరీస్ విజయం. స్వదేశంలో కోహ్లీ కెప్టెన్సీలో భారత్ మూడు ఫార్మాట్లలో కలిపి 16 సిరీస్లు ఆడింది. 14 సిరీస్లలో గెలిచింది. మరో సిరీస్ను 'డ్రా' చేసుకొని తాజా టి20 సిరీస్లో ఓడింది.
* వరుసగా రెండు ద్వైపాక్షిక టి20 సిరీస్లను ఓడిపోవడం భారత్కిదే తొలిసారి. ఈ సిరీస్కంటే ముందు న్యూజిలాండ్లోనూ భారత్కు ఓటమి ఎదురైంది.
* అంతర్జాతీయ టి20ల్లో మ్యాక్స్వెల్కిది మూడో సెంచరీ. దీంతో అతడు న్యూజిలాండ్ ప్లేయర్ కొలిన్ మున్రో సరసన నిలిచాడు. ఈ జాబితాలో నాలుగు సెంచరీలతో రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
* ఈ మ్యాచ్లో మ్యాక్స్వెల్ (113 నాటౌట్)గా నిలిచాడు. టీ20ల్లో విజయవంతమైన ఛేదనల్లో ఇది ఐదో అత్యధిక స్కోరు. ఎవిన్ లూయిస్ (125 నాటౌట్) అగ్రస్థానంలో ఉన్నాడు.
* చిన్నస్వామి స్టేడియంలో జరిగిన టీ20ల్లో ఎక్కువ సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ (104) నిలిచాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో గేల్ (150) ఉన్నాడు.