ఆరు నెలలు ఆటకి దూరం:
యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సమయంలో గాయపడిన ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఏకంగా ఆరు నెలలు ఆటకి దూరంగా ఉండబోతున్నాడు. ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభంలోనే భువీ తొడ కండరాలకి గాయమవగా.. ఇప్పటికీ అతడు ఫిట్నెస్ సాధించలేదు. వచ్చే జనవరి 10 నుంచి ప్రారంభంకానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కోసం ఉత్తర్ప్రదేశ్ జట్టు సెలెక్షన్ కమిటీ.. భువీ ఫిట్నెస్ను తాజాగా పరిశీలించింది. అతను కనీసం ఆరు నెలలు ఆటకి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారట. దీంతో టీమిండియాకు భారీ షాక్ తగిలింది.
మళ్లీ ఐపీఎల్లోనే?:
గాయం కారణంగా భారత్ వేదికగా ఇంగ్లాండ్తో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న సుదీర్ఘ సిరీస్కి కూడా భువనేశ్వర్ కుమార్ దూరంగా ఉండబోతున్నాడు. ఆస్ట్రేలియా టూర్లో గాయపడిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఇప్పటికే ఆరు వారాలు క్రికెట్కి దూరమయ్యాడు. షమీ కూడా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడడం అనుమానంగానే ఉంది. ఇప్పుడు భువీ కూడా దూరమవడం కోహ్లీసేనను కలవరపెడుతోంది. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్ జరిగే సూచనలు ఉన్నాయి. అప్పటికి కూడా భువనేశ్వర్ ఫిట్నెస్ సాధించడం సందేహంగానే కనిపిస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్లో భువీ ఆడుతున్న విషయం తెలిసిందే.
బౌలింగ్ చేస్తూ:
ఐపీఎల్ 2020లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన లీగ్ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. 19వ ఓవర్ తొలి బంతిని విసిరే క్రమంలో భువీకి గాయం అయింది. తొడ కండరాలకి గాయమవగా.. మొదట నడిచేందుకు అతడు ఇబ్బంది పడ్డా.. ఆ తర్వాత ఫిజియో సాయంతో మళ్లీ బౌలింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. రెండో బంతి వేసే క్రమంలో రనప్ పూర్తి కాకుండానే గాయం తీవ్రత కారణంగా వికెట్ల వద్దకి వచ్చి ఆగిపోయాడు. అయినా బౌలింగ్ వేసేందుకు మూడోసారి ప్రయత్నించాడు. నొప్పి భరించలేక ఆఖరికి మైదానాన్ని వీడాడు. దీంతో ఓవర్ను మరో పేసర్ ఖలీల్ అహ్మద్ పూర్తి చేశాడు. అప్పటినుంచి భువీ ఆటకు దూరంగా ఉన్నాడు. ఆసీస్ పర్యటనకు కూడా అతడిని పరిగణలోకి తీసుకోలేదు.
గత కొంతకాలంగా వేధిస్తున్న తొడ కండరాల గాయం:
భువనేశ్వర్ కుమార్ని గత కొంతకాలంగా తొడ కండరాల గాయం వేధిస్తోంది. గత ఏడాది చివరలో కూడా ఇదే గాయంతో టీమిండియాకి దూరమయ్యాడు. ఇప్పుడు కూడా భువీ తొడకండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఓ ఫాస్ట్ బౌలర్ తొడ కండరాల గాయం నుంచి వేగంగా కోలుకుని ఫిట్నెస్ సాధించడం చాలా కష్టం. అంతర్జాతీయ కెరీర్లో భువీ ఇప్పటివరకు 21 టెస్టుల్లో, 114 వన్డేల్లో, 43 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 121 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు.
చెప్పుకోదగ్గ ప్రదర్శన లేకున్నా.. అజహరుద్దీన్ తనయుడుకి జట్టులో చోటు!!