హైదరాబాద్: సొంత గడ్డపై శ్రీలంక మరోసారి సత్తా చాటింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో 278 పరుగుల తేడాతో గెలుపొందిన శ్రీలంక, తాజాగా కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టులో 199 పరుగుల తేడాతో విజయం సాధించింది.
శ్రీలంక స్పిన్నర్ రంగానా హెరాత్ 6 వికెట్లతో విజృంభించడంతో 2006 తర్వాత దక్షిణాఫ్రికాపై తొలిసారి టెస్టు సిరిస్ విజయాన్ని నమోదు చేసింది. ఈ సిరీస్లో శ్రీలంక స్పిన్నర్లను ఎదుర్కోవడంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ తీవ్రంగా విఫలమయ్యారు.
కొలంబో వేదికగా జరిగిన ఈ టెస్టులో ఓవర్ నైట్ స్కోరు 139/5తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికాను బవుమా (98 బంతుల్లో 63), డి బ్రుయిన్ (232 బంతుల్లో 101) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్కు 123 పరుగులు జోడించారు.
అయితే, బవుమా ఔటయ్యాక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సఫారీ బ్యాట్స్మెన్ లంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొనలేకపోయారు. కెరీర్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్న బ్రుయిన్... రంగనా హెరాత్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు.
చివర్లో డేల్ స్టెయిన్, రబాడ తక్కువ స్కోరుకే పెవిలియన్కు చేరడంతో సఫారీ జట్టు 290 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో హెరాత్ 6 వికెట్లు తీయగా.. దిల్రువాన్ పెరీరా, అకిల ధనంజయ చెరో రెండో వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో లంక పేసర్లు కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేశారు.
ఆ రెండు ఓవర్లను లంక కెప్టెన్ లక్మల్ వేయడం విశేషం. ఒక్క పరుగు కూడా చేయకుండా, ఒక్క వికెట్ కూడా తీయకుండా టెస్టు మ్యాచ్లో గెలుపొందిన 12వ కెప్టెన్గా లక్మల్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
రెండో టెస్టు మ్యాచ్ వివరాలు:
తొలి ఇన్నింగ్స్:
శ్రీలంక: 338
దక్షిణాఫ్రికా: 124
రెండో ఇన్నింగ్స్:
శ్రీలంక: 75/5 decl
దక్షిణాఫ్రికా: 290
మ్యాచ్ ఫలితం: 199 పరుగుల తేడాతో లంక విజయం