గాల్లే: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్(309 బంతుల్లో 18 ఫోర్లతో 186) తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. స్ట్రైకింగ్ తీసుకోవాలనే ఆతృతలో టేలండర్ మార్క్ వుడ్(1)తో లేని పరుగుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు. ఇక జోరూట్ అద్వితీయ ఇన్నింగ్స్తో ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 114.2 ఓవర్లలో 9 వికెట్లకు 339 పరుగులు చేసింది.
జోరూట్కు అండగా.. వికెట్ కీపర్ జోస్ బట్లర్(55) రాణించాడు. ఇక శ్రీలంక బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ లసిత్ ఎంబుల్దెనియా(7/132) ఏడు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. శ్రీలంక కంటే ఇంగ్లండ్ ఇంకా 42 పరుగుల వెనుకంజలో ఉంది. ఇక శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్స్లో 381 పరుగులు చేసింది. ఏంజేలో మాథ్యూస్(110) సెంచరీతో రాణించగా.. దినేశ్ చండిమల్(52), నిరోషన్ డిక్ వెల్లా(92), దిలురువాన్ పెరెరా(67) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఈ మ్యాచ్లో జోరూట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇటీవల టెస్టుల్లో తమ జట్టు తరఫున 8వేల పరుగులు చేసిన ఏడో బ్యాట్స్మన్గా నిలిచిన ఈ ఇంగ్లండ్ కెప్టెన్.. తాజాగా ఆ రికార్డులో మూడు అడుగులు ముందుకు జరిగి మరో మైలురాయిని అందుకున్నాడు. తమ జట్టు మాజీ ఓపెనర్ జెఫ్రీ బాయ్కాట్, మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్(8,181), డేవిడ్ గోవర్(8,231) ను వెనక్కి నెట్టాడు. తద్వారా టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఇంగ్లండ్ నాలుగో క్రికెటర్గా నిలిచాడు. ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానంలో ఇంగ్లండ్ మాజీ సారథి అలిస్టర్ కుక్(12,477) ఉండగా.. గ్రాహం గూచ్(8,900), అలెక్ స్టీవార్ట్(8,463) జోరూట్(8,238) కన్నా ముందున్నారు.