హైదరాబాద్: శ్రీలంక పేసర్ లసిత్ మలింగకు ఘనమైన వీడ్కోలు పలుకుతామని ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నే పేర్కొన్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగే తొలి వన్డే శ్రీలంక పేసర్ లసిత్ మలింగకు ఆఖరి వన్డే.
ఈ మ్యాచ్కి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నే మాట్లాడుతూ "రేపటి మ్యాచ్లో విజయమే మా ముందున్న ప్రధాన లక్ష్యం. అదే లసిత్కు మేమిచ్చే అత్యుత్తమ కానుక. కచ్చితంగా రేపు అతనికి అద్భుతమైన వీడ్కోలు ఇస్తాం" అని అన్నాడు.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
మరోవైపు బంగ్లా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ కూడా మలింగ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించాడు. లసిత్ ఆటకు గొప్ప అంబాసిడర్ అని, అతని ఆట చూసే చాలా మంది యువ ఆటగాళ్లు క్రికెట్ ఆడటం మొదలుపెట్టారని తమీమ్ ఈ సందర్భంగా వెల్లడించాడు.
ఇప్పటివరకు మలింగ 15 ఏళ్ల కెరీర్లో 225 వన్డేల్లో 29.02 సగటుతో 335 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజాలు ముత్తయ్య మురళీధరన్ (523), చమిందా వాస్ (399) తర్వాత వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన లంక బౌలర్గా మలింగ నిలిచాడు.
మూడు వన్డేల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే శుక్రవారం ప్రారంభం కానుంది. ఇదే మలింగకు ఆఖరి వన్డే కానుంది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్లో లసిత్ మలింగ 13 వికెట్లు పడగొట్టాడు.