హైదరాబాద్: ఢిల్లీ కాలుష్యంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి శ్రీలంక క్రికెట్ బోర్డు ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నా తమ క్రికెటర్లు ఇబ్బంది పడుతూ ఆడారని అందులో పేర్కొంది. బీసీసీఐ సైతం తమ క్రికెటర్లు ఆడాల్సిందేనంటూ ఒత్తిడి చేసిందని ఐసీసీకి చేసిన ఫిర్యాదులో శ్రీలంక క్రికెట్ బోర్డు పేర్కొంది.
ఆస్ట్రేలియా రికార్డు సమం: భారత్కు షాకిచ్చిన లంక, ఢిల్లీ టెస్టు డ్రా
ఈ మేరకు మంగళవారం ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు శ్రీలంక క్రీడామంత్రి దయసిరి జయశేఖర తెలిపారు. తమ టీమ్కు చెందిన నలుగురు ప్లేయర్లు వాంతులు చేసుకున్నారని, అలాంటి వాతావరణంలో తాము ఆడలేమని శ్రీలంక క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు మంత్రి తెలిపారు.
తమ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటామని ఐసీసీ తెలిపిందని ఆయన అన్నారు. కానీ కచ్చితంగా ఏవిధమైన చర్యలను ఐసీసీ తీసుకోనుందో దానికి సంబంధించిన సమాచారం లేదని ఆయన చెప్పారు. ఢిల్లీలో కాలుష్యం కారణంగా రెండో రోజు నుంచే శ్రీలంక ఆటగాళ్లు మాస్కులు ధరించి క్రికెట్ ఆడారు.
ముఖ్యంగా నాలుగో రోజైన మంగళవారం వెలుతురు లేకపోయినా అంఫైర్లు ఆటను కొనసాగించాలనే నిర్ణయం తీసుకోవడాన్ని శ్రీలంక మేనేజ్మెంట్ తప్పుబడుతోంది. ఇదిలా ఉంటే ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన చివరి టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు ధనంజయ డిసిల్వా (119), రోషన్ సిల్వా (74 నాటౌట్), డిక్వెల్లా (44 నాటౌట్) అద్భుత పోరాటంతో లంక ఓటమి నుంచి తప్పించారు.
చివరి రోజు టీమిండియా విజయానికి 7 వికెట్లు అవసరం కాగా 87 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగారు. దీంతో మూడు టెస్టుల సిరిస్ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది. భారత జట్టుకిది వరుసగా తొమ్మిదో సిరీస్ విజయం కావడం విశేషం. దీంతో గతంలో ఆస్ట్రేలియా పేరిట ఉన్న ఈ రికార్డును టీమిండియా సమం చేసింది.
చివరిరోజైన బుధవారం మ్యాచ్లో మరింత సమయం మిగిలి ఉన్నప్పటికీ, ఫలితం వచ్చేలా కనిపించకపోవడంతో ఇరు జట్లకు చెందిన కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 299 పరుగులు చేయడం విశేషం. ఓ విదేశీ జట్టు భారత గడ్డపై నాలుగో ఇన్నింగ్స్లో చేసిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.