దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అయిన క్రికెట్ సౌతాఫ్రికా శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఆరు జట్లతో కూడిన ఫ్రాంచైజీ ఆధారిత టీ20 లీగ్ను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ లీగ్లో ఆరు జట్లు.. ప్రతి ఒక్క జట్టుతో రెండేసి మ్యాచ్లు ఆడుతాయి. లీగ్ మ్యాచ్ల్లో పాయింట్ల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్ దశకు చేరుకుంటాయి. మూడు జట్లు మళ్లీ ప్రతి జట్టుతో ఒక మ్యాచ్ ఆడతాయి. మూడింట్లో టాప్ ప్లేస్లో ఉన్న రెండు జట్లు ఫైనల్ చేరుకుంటాయి. ఫైనల్లో గెలిచిన జట్టు టోర్నీ విజేతగా నిలుస్తుంది.
ఇక ఈ కొత్త టీ20 లీగ్లో మొత్తం 33మ్యాచ్లు జరుగుతాయి. టోర్నీ 3లేదా 4వారాలు కొనసాగుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాదిరిగానే.. ఈ టోర్నమెంట్లో ప్రతి జట్టు ప్లేయింగ్ XIలో గరిష్ఠంగా నలుగురు అంతర్జాతీయ ఆటగాళ్లను ఆడించొచ్చు. అలాగే ప్లేయర్లను వేలంలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తాయి. వేలం తేదీలు, మ్యాచ్ల వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
ఈ టీ20లీగ్ మొదటి ఎడిషన్ 2023 జనవరి నెలలో ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఖరారైన దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన వెంటనే ఈ టోర్నీ మొదలవుతుంది. ఇక ప్రతి ఏటా జనవరి నెల లీగ్ నిర్వహణ జరుగుతుంది. దీనిపై క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈవో) ఫోలెక్సీ మోజెకీ స్పందిస్తూ.. ఈ తాజా, ఉత్తేజకరమైన టీ20లీగ్ నిర్వహణ జరపబోతున్నట్లు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తద్వారా ఆరు ఫ్రాంఛైజీలలోకి ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి ఈ లీగ్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ఏర్పడిందని తెలిపారు. మంచి రెమ్యూనరేషన్తో అత్యుత్తమ దేశీయ, అంతర్జాతీయ ప్లేయర్లను ఆకర్షించడానికి, స్థిరమైన వ్యాపార నమూనాతో కూడిన లీగ్ను, జట్లను నిర్వహించడానికి ఈ టోర్నీ ఉపయోగపడుతుందని చెప్పారు.
క్రికెట్ సౌతాఫ్రికా, బ్రాడ్కాస్టర్ సూపర్స్పోర్ట్ ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త కంపెనీ ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తుంది. తొలుత పురుషుల టోర్నీ నిర్వహించనుండగా.. తదనంతరం టీ20 మహిళల ఈవెంట్ను కూడా నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. దక్షిణాఫ్రికా క్రికెట్లో ఈ లీగ్ ఓ చరిత్ర నెలకొల్పడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే వ్యూయర్ షిప్ పరంగా.. ఐపీఎల్ లాంటి టోర్నీకి ఏ టోర్నీ సాటిరాదు. ఇప్పటికే పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలో పలు టీ20టోర్నీలు జరుగుతుండగా.. వాటికి ఏర్పడ్డ క్రేజు అంతంత మాత్రమే. ఆ టోర్నీల్లో ఐపీఎల్తో పోల్చితే ఆటగాళ్ల రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువే.