హైదరాబాద్: ప్రపంచంలో అత్యుత్తమ బౌలింగ్ అటాక్ను కలిగి ఉన్న జట్లలో దక్షిణాఫ్రికా ఒకటని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా అత్యంత ప్రమాదకరమైన జట్టు అనడంలో ఎటువంటి సందేహం లేదని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.
శుక్రవారం నుంచి కేప్టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో రోహిత్ శర్మ సోమవారం మీడియాతో మాట్లాడాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల బౌలింగ్ అటాక్తో పోలిస్తే.. దక్షిణాఫ్రికానే మెరుగైన జట్టు అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
ప్రపంచంలో అత్యుత్తమ బౌలింగ్ అటాక్ను కలిగి ఉన్న దక్షిణాఫ్రికాను సొంతగడ్డపై ఓడించడం అంత తేలిక కాదని అన్నాడు. బౌన్సీ వికెట్పై దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడం కష్టమని రోహిత్ అభిప్రాయపడ్డాడు. 'ప్రపంచ అత్యుత్తమ బౌలింగ్ దక్షిణాఫ్రికా సొంతం. సఫారీ గడ్డ మీద స్టెయిన్ అండ్ కో పేస్ బృందాన్ని ఎదుర్కోవడం కచ్చితంగా సవాల్తో కూడుకున్నది. సఫారీలపై పైచేయి సాధించాలంటే శ్రమించాల్సి ఉంది. అందుకు టీమిండియా సిద్ధంగా ఉంది' అని రోహిత్ పేర్కొన్నాడు.
'యువ బౌలర్ కగిసో రబడ బ్యాట్స్మెన్ హెల్మెట్కి తగిలేలా బౌన్సర్లు విసురుతున్నాడు. సఫారీ బౌలర్లలో వెరైటీ ఎక్కువగా కనిపిస్తుంది. రబడతో పాటు సీనియర్ బౌలర్లు మోర్నీ మోర్కెల్, డేల్ స్టెయిన్ కొత్త బంతితోనే కాదు, పాత బంతితోనూ బ్యాట్స్మెన్ని ఉక్కిరిబిక్కిరి చేయగలరు. ఫిలాండర్ కూడా వారి సొంతగడ్డపై ప్రమాదకర బౌలరే. అందుకే దక్షిణాఫ్రికా బౌలింగ్ని ఎదుర్కోవడం భారత్ జట్టుకి ఓ సవాల్' అని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్గా వచ్చే రోహిత్ శర్మ.. టెస్టుల్లో మాత్రం మిడిలార్డర్లో బ్యాటింగ్కి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో కోహ్లీసేన జనవరి 5న కేప్ టౌన్ వేదికగా జరగనున్న తొలి టెస్టులో తలపడనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.