కోల్కతా: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై కోల్కతాలోని అపోలో ఆసుపత్రి వైద్యులు తాజాగా బులిటెన్ విడుదల చేశారు. దాదా పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, శుక్రవారం ఆయనను క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి ప్రైవేట్ గదికి తరలించినట్టు వైద్యులు చెప్పారు. అయితే దాదా డిశ్చార్జ్పై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అపోలో ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.
'సౌరవ్ గంగూలీని డాక్టర్ అఫ్తాబ్ ఖాన్, డాక్టర్ అశ్విన్ మెహతా పరీక్షించారు. ప్రస్తుతం ఆయన బాగున్నారు. క్రిటికల్ కేర్లోని ప్రత్యేక గది నుంచి ప్రైవేట్ రూంకు దాదాను తరలించాం. డిశ్చార్జ్పై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు' అని అపోలో ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. ఛాతి నొప్పితో గత బుధవారం ఆసుపత్రిలో చేరిన గంగూలీకి యాంజియోప్లాస్టీ నిర్వహించి గుండెకి రెండు స్టంట్లు వేసిన విషయం తెలిసిందే.
జనవరి మొదటి వారంలో కోల్కతాలోని తన ఇంటిలో వ్యాయామం చేస్తుండగా.. సౌరవ్ గంగూలీకి స్వల్ప గుండెపోటు వచ్చింది. దాంతో వుడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరిన దాదాకి పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అతని గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్లు స్పష్టం చేశారు. యాంజియోప్లాస్టీ ద్వారా సమస్య అధికంగా ఉన్నచోట ఒక స్టంట్ అమర్చారు. ఆరు రోజుల తర్వాత దాదాను డిశ్చార్జ్ చేశారు. ఆపై గంగూలీ ఆరోగ్యం కుదుటపడడంతో మిగతా చోట్ల స్టంట్ వేయడాన్ని వాయిదా వేశారు.
గత బుధవారం మళ్లీ బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి ఛాతిలో నొప్పి వచ్చింది. ఈసారి కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. గురువారం ఆయనకు వరుసగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను విశ్లేషించిన వైద్య బృందం స్టెంట్లు వేసేందుకు నిర్ణయించారు. ఆ రోజు సాయంత్రం మరోమారు యాంజియోప్లాస్టీ నిర్వహించి మిగతా రెండు స్టంట్స్ వేశారు. దాదా ఆరోగ్యం నిలకడగా ఉండడంతో క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి ప్రైవేట్ గదికి తరలించారు. డాక్టర్ అఫ్తాబ్ ఖాన్, డాక్టర్ అశ్విన్ మెహతా గంగూలీ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
భారత్-ఇంగ్లండ్ సిరీస్కు ముగ్గురూ భారత అంపైర్లే!!