
ముంబై: భారత్లో యువ ఆటగాళ్లు ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు సురక్షిత ప్రయాణం చేసే అవకాశం ఉన్నప్పుడే దేశవాళీ క్రికెట్ సీజన్ ఆరంభమవుతుందని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. అక్టోబర్లో ఇండియన్ ప్రీమియర్ (ఐపీఎల్)-13వ సీజన్ జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో దేశవాళీ సీజన్పై సందిగ్ధత తీవ్రమైంది. సాధారణంగా 2020-21 దేశవాళీ సీజన్ ఆగస్టు చివర్లో మొదలయ్యే విజయ్ హజారె ట్రోఫీతో ఆరంభమవ్వాలి.
దేశవాళీ సీజన్పై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ తాజాగా స్పదించాడు. 'దేశవాళీ క్రికెట్ జరగడం ముఖ్యమే. కానీ కరోనా వైరస్ ప్రభావం ముగిశాకే అది సాధ్యం. జూనియర్ క్రికెట్ ఆడేందుకు సురక్షితమైన వాతావరణం ఏర్పడినప్పుడే సీజన్ మొదలవ్వాలి. ఎందుకంటే.. దేశవాళీ క్రికెట్ కోసం యువ ఆటగాళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. యువ ఆటగాళ్లను ప్రమాదంలో పడేయాలని మేం అనుకోవట్లేదు. అందుకే ప్రయాణాలు సురక్షితమైనప్పుడు మాత్రమే దేశవాళీ క్రికెట్ ప్రారంభమవుతుంది' అని గంగూలీ చెప్పాడు.
ఈ ఏడాది ఆగస్టులో విజయ్ హజారే ట్రోఫీతో దేశవాళీ క్రికెట్ సీజన్ మొదలవ్వాల్సి ఉంది. ఆ తర్వాత రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగాల్సి ఉంది. అయితే ఈ ఏడాది తొలిదశ లాక్డౌన్ సమయంలోనే ఇరానీ కప్ రద్దయింది. భారత యువ ఆటగాళ్లు తమ తమ రాష్ట్రాల తరఫున దేశవాళీ క్రికెట్ సీజస్లో ఆడి జాతీయ జట్టుకు ఎంపికవుతారు. ఇక టీమిండియా జట్టులోని ఆటగాళ్లు ఫామ్ కోల్పోయినప్పుడు, క్రికెట్ సిరీస్లు లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడుతుంటారు.
భారత్లో ఐపీఎల్ 2020 నిర్వహించడమే తనకు మొట్టమొదటి ప్రాధాన్యతాంశమని సౌరవ్ గంగూలీ తాజాగా అన్నాడు. ఐపీఎల్ లేకుండా 2020 ముగిసిపోవడం ఏమాత్రం ఇష్టం లేదన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లేకుండానే ముగుస్తోందా.. అనుకున్నప్పటికి దాదా వాఖ్యలతో ఈవెంట్ జరుతుందనే నమ్మకం అభిమానుల్లో పెరిగింది. ఐసీసీ టి20 వరల్డ్కప్ భవితవ్యాన్ని బట్టి ఐపీఎల్ తేదీలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే తాజా పరిణామాలను చూస్తే టీ20 వరల్డ్కప్ జరగడం కష్టమే అనిపిస్తోంది.