కోల్కతా: అహ్మద్బాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్కు టికెట్లన్నీ అమ్ముడయ్యాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఏప్రిల్ రెండవ వారంలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021లో ప్రేక్షకులను అనుమతించడాన్ని బీసీసీఐ పరిశీలిస్తోందని, అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ఏడాది చాలా మ్యాచులు ఆడాల్సి ఉన్నదని, ప్రేక్షకులను ఐపీఎల్కు తీసుకువచ్చేందుకు యోచిస్తున్నామని దాదా తెలిపారు. కరోనా మహమ్మరి అనంతరం వాతావరణం తిరిగి సాధారణస్థితికి చేరుకోవడం సంతోషకరంగా ఉందని గంగూలీ చెప్పారు.
'అహ్మదాబాద్ టెస్ట్ టికెట్లు అన్ని అమ్ముడయ్యాయి. మునపటి స్థితికి తిరిగి చేరుకోవడం సంతోషంగా ఉంది. జై షాతో మాట్లాడాను. అతడు టెస్టు మ్యాచ్లపై ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. అహ్మదాబాద్కు 6-7 ఏళ్ల తర్వాత తిరిగి క్రికెట్ వస్తుంది. వాళ్లు కొత్త స్టేడియాన్ని నిర్మించారు. గతంలోనే కోల్కతా వేదికగా డే/నైట్ టెస్టును విజయవంతంగా నిర్వహించాం. స్టేడియంలో ప్రతీ సీట్ అభిమానులతో నిండిపోవాలి' అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. అహ్మదాబాద్లో కొత్తగా నిర్మించిన స్టేడియం టెస్ట్ మ్యాచుకు సిద్ధమైంది. ఏడేళ్ల తర్వాత అహ్మదాబాద్లో క్రికెట్ తిరిగి ఆడేందుకు సిద్ధం అవడంతో అక్కడి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
'ఈ ఏడాది క్రికెట్ ఎంతో గొప్పగా ఉంటుంది. ఐపీఎల్ 2021కు తిరిగి ప్రేక్షకులని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. దీనిపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఐపీఎల్ మరో విజయవంతమైన టోర్నీగా నిలుస్తుంది. ఈసారి జరిగే ఐపీఎల్ వేలం.. మెగా వేలం కాదు. కానీ చాలా జట్లు ఆటగాళ్లను తీసుకోవాలని భావిస్తున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో చురుకుగా పాల్గొనాలని చూస్తున్నాయి' అని టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ వెల్లడించారు.
'స్వదేశంలో జరగనున్న ప్రతి టెస్టు సిరీస్లో ఓ డే/నైట్ మ్యాచ్ను తప్పక నిర్వహిస్తాం. ప్రతి జనరేషన్ మార్పును కోరుకుంటుంది. ప్రస్తుతం టెస్టు క్రికెట్లో పింక్ బాల్ ప్రధాన మార్పు. టెస్టు క్రికెట్ను మనం కాపాడుకోవాలి' అని బీసీసీఐ బాస్సౌరవ్ గంగూలీ అన్నారు. తన ఆరోగ్యం గురించి దాదా మాట్లాడారు. రెండు రౌండ్ల యాంజియోప్లాస్టీ చేయించుకున్నానని, ఇప్పుడు ఫిట్ అండ్ ఫైన్గా ఉన్నానని, అందుకే తిరిగి పనిలోకి వెంటనే రాగలిగానన్నారు. అందరూ ఊహించినంత ప్రమాదం ఏమీ లేదని తెలిపారు.