కోల్కతా: ఫ్లడ్లైట్ల వెలుతురులో ఎర్ర బంతితో పోలిస్తే గులాబి బంతే స్పష్టంగా కనిపిస్తుంది అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. భారత్-బంగ్లాదేశ్ డే/నైట్ టెస్ట్కు ముందు గులాబీ బంతిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. గులాబీ కోటింగ్ ఎక్కువగా కలిగిన ఈ బంతి ఫ్లడ్లైట్ల వెలుతురులో ఎంత బాగా కనిపిస్తుందన్నది చర్చనీయాంశమైంది. గంగూలీ మాత్రం ఎర్రబంతి కంటే గులాబీ బంతే స్పష్టంగా కనిపిస్తున్నదని తేల్చి చెప్పాడు.
చారిత్రక టెస్టు మ్యాచ్ సందర్భంగా దాదా మీడియాతో మాట్లాడారు. సంధ్య వెలుగులో బంతిని గుర్తించడం సంక్లిష్టంగా ఉంటుందని వాదనలు వచ్చాయి. ఈ విషయమై ప్రశ్నించగా.. 'ఎరుపు బంతి కన్నా గులాబి బంతే బాగా కనిపిస్తోంది' అని దాదా సమాధానం ఇచ్చాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీమిండియా గులాబి బంతితో డే/నైట్ టెస్టు ఆడుతుందా అన్న ప్రశ్నకు మాత్రం గంగూలీ కచ్చితమైన సమాధానం ఇవ్వలేదు.
డే/నైట్ టెస్టుకు వేల సంఖ్యలో అభిమానులు హాజరుకావడంతో దాదా సంతోషం వ్యక్తం చేశారు. 'చాలా మంది మ్యాచ్ను చూశారు. చాలా సంతోషంగా ఉంది. జనాలు మ్యాచ్ను చూడడం అత్యంత ముఖ్యం. నేను ఆందోళనలో లేను. కాస్త తీరిక లేకుండా ఉన్నాను' అని దాదా తెలిపారు.
మ్యాచ్కు ముఖ్య అతిథిగా హాజరైన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు దాదా కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్ పితామహుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ వందో వార్షికోత్సవ వేడుకల సందర్భంగా వచ్చే ఏడాది బీసీబీ నిర్వహిస్తున్న ఆసియా ఆల్స్టార్ ఎలెవన్, ప్రపంచ ఆల్స్టార్ ఎలెవన్ రెండు టీ20ల సిరీస్కు హాజరవుతానని హామీ ఇచ్చారు.