లార్డ్స్లో అరంగేట్రం:
1996లో ఇంగ్లండ్ పర్యటనలోని తొలి టెస్టులో సౌరవ్ గంగూలీకి అవకాశం రాలేదు. అప్పటికే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా మంది ఉండడంతో.. జట్టు యాజమాన్యం అతడిని ఆడించలేదు. ఆ టెస్టులో భారత్ పరాజయం పాలైంది. అనంతరం లార్డ్స్లో జరిగిన రెండో టెస్టులో దాదాకు అవకాశం వచ్చింది. ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి 344 పరుగుల భారీ స్కోర్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ బరిలోకి దిగగా ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అప్పుడే గంగూలీ మూడో బ్యాట్స్మన్గా క్రీజులోకి వెళ్లి తనదైన బ్యాటింగ్తో అలరించాడు. 131 పరుగులు చేసి లార్డ్స్లో అరంగేట్ర టెస్టులోనే సెంచరీ బాదాడు.
|
తొలి మ్యాచ్లోనే శతకం:
లార్డ్స్లో సెంచరీ బాదడంతో టెస్టుల్లో తొలి మ్యాచ్లోనే శతకం బాదిన పదో క్రికెటర్గా సౌరవ్ గంగూలీ రికార్డు సృష్టించాడు. క్రికెట్కు పుట్టినిల్లు అయిన ఆ మైదానంలో సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా కూడా గుర్తింపు పొందాడు. అయితే దాదా బ్యాటింగ్తో భారత్ ఆ మ్యాచ్ను డ్రాగా ముగించింది. చివరికి ఆ టెస్టు సిరీస్ను మాత్రం 0-1తో కోల్పోయింది. ఆ అద్భుత సెంచరీని గుర్తు చేసుకున్న బీసీసీఐ బాస్ శనివారం ఆ మ్యాచ్కు సంబంధించిన ఫొటోలను ట్విటర్లో అభిమానులతో పంచుకున్నాడు. తన జీవితంలో ఇదో ప్రత్యేకమైన రోజని పేర్కొన్నాడు.
ఈరోజే అరంగేట్రం చేశా:
'ఈరోజే టెస్టుల్లో అరంగేట్రం చేశా. జీవితంలో గొప్ప క్షణాలు అవి. లార్డ్స్లో తొలి సెంచరీ సాధించడం నా కెరీర్లోనే గొప్ప విశేషం' అని సౌరవ్ గంగూలీ ట్వీట్లో రాసుకొచ్చాడు. ఇదే మ్యాచ్ గురించి గతంలో ఓసారి ఇండియాటుడే కార్యక్రమంలో మాట్లాడుతూ... '1996లో లార్డ్స్లో ఆడుతున్నప్పుడు నా ఆలోచనా విధానం నమ్మశక్యం కాని విధంగా ఉంది. అప్పుడు నాకు ఎలాంటి భయమూ లేదు. అలా వెళ్లి ఆడేశా. అంతకుముందు బ్రిస్టల్లో ఆడిన వార్మప్ మ్యాచ్ కూడా గుర్తుంది. తొలి ఇన్నింగ్స్లో డకౌట్గా వెనుదిరిగా. తర్వాత రెండో ఇన్నింగ్స్లో 70 పరుగులు చేశా. ఆ తర్వాత సిరీస్ ప్రారంభమయ్యాక మరింత బాగా రాణించా' అని దాదా పేర్కొన్నాడు.