నన్ను తప్పించినట్టే మిథాలీని తప్పించారు: అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్న దాదా


హైదరాబాద్: ఐసీసీ వరల్డ్ టీ20లో మంచి ఫామ్లో ఉన్నా జట్టు నుంచి హైదరాబాద్ స్టార్ మిథాలీరాజ్ను తప్పించడం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. గతంలో బ్యాటింగ్లో రాణిస్తోన్న సమయంలో తనకు కూడా ఇలాంటి సంఘటనే జరిగిందని గంగూలీ తాజాగా గుర్తు చేసుకున్నాడు.
వెస్టిండిస్ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్ టీ20లో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో ఆడకుండా మిథాలీని తప్పించిన సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీనిపై గంగూలీ మాట్లాడుతూ గతంలో తనకూ ఈ అనుభవం ఎదురైంది కాబట్టి మిథాలీ వ్యవహారం ఆశ్చర్యపరచలేదని అన్నాడు.

మిథాలీని పక్కకు తప్పించడం ఆశ్చర్యం కలిగించలేదు
"జట్టులో చోటు కల్పించకుండా మిథాలీని పక్కకు తప్పించడం ఆశ్చర్యం కలిగించలేదు. గతంలో కెప్టెన్గా విజయవంతంగా కొనసాగినా, నన్నూ డగౌట్లో కూర్చోబెట్టారు. మిథాలీని తప్పించిన తర్వాత ఆ తరహా బృందంలోకి స్వాగతించాను. జట్టు కెప్టెన్ కూర్చోమంటే మనం కూర్చోవాల్సిందే. ప్రపంచ వన్డే క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్న సమయంలోనే 15 నెలలపాటు వన్డే జట్టుకు దూరం చేశారు" అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

ఫైసలాబాద్ టెస్టుకు ముందు కూర్చోబెడితే అదే చేశాను
"ఫైసలాబాద్ టెస్టుకు ముందు కూర్చోబెడితే అదే చేశాను. ప్రపంచంలో అద్భుతంగా ఆడుతున్నా కొందరికి తలుపులు మూసేస్తారు. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను కూడా ఇలా ఇంటికి పంపించారు. నువ్వు అత్యుత్తమం అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎంతో కృషి చేశావు. మిథాలీకి మరోసారి అవకాశం తప్పకుండా వస్తుంది" అని గంగూలీ 2006లో టెస్టు జట్టు నుంచి తనను తప్పించడాన్ని గుర్తు చేశాడు.

మిథాలీని తప్పించడం కంటే భారత్ ఓటమే బాధించింది
"అందుకే మిథాలీని రిజర్వు బెంచీపై కూర్చోబెట్టినప్పుడు ఆశ్చర్యం కలగలేదు. మైదానంలో స్పందన చూసీ ఆశ్చర్యం అనిపించలేదు. మిథాలీని తప్పించడం కంటే భారత్ ఓడటమే నన్ను ఎక్కువగా బాధించింది. ప్రపంచకప్ సాధిస్తారనుకున్నా. జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి కష్టాలు ఎదురవుతాయని, జీవితంలో దేనికీ గ్యారంటీ లేదు" అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు.

మిథాలీని తప్పించడంపై వివరణ కోరనున్న సీఓఏ
టీ20 వరల్డ్కప్లో పాక్, ఐర్లాండ్పై వరుసగా హాఫ్ సెంచరీలు సాధించిన మిథాలీని ఇంగ్లాండ్తో కీలకమైన సెమీస్లో తప్పించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సెమీస్లో మిథాలీని ఆడించకుండా తప్పించిన వివాదంపై వివరణ కోరాలని పాలకుల కమిటీ(సీఓఏ) నిర్ణయించింది. భారత జట్టు స్వదేశం తిరిగొచ్చిన తర్వాత దీనికి సంబంధించి మిథాలీ, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, కోచ్ రమేశ్ పొవార్, మేనేజర్ తృప్తి, సెలక్టర్ సుధ షాలతో సీఓఏ బృందం విడివిడిగా మాట్లాడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications