ముంబై: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే అభిమానులకు పండగే. దాయాదుల మధ్య పోరును కొందరు ఓ యుద్ధంలా చూస్తున్నారు. మైదానంలో కూడా ఢీ అంటే ఢీ అనేలా ఫాన్స్ తలపడతారు. అయితే సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. దీంతో దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్లు అత్యంత అరుదుగా మారాయి. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే అభిమానులకు ఆ అవకాశం దక్కుతోంది. చివరిసారిగా ఆదివారం ముగిసిన టీ20 ప్రపంచకప్ సూపర్-12 గ్రూప్-2లో భాగంగా ఇరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో పాక్ విజయం సాధించి.. మెగా టోర్నీల్లో భారత్ విజయాలను అడ్డుకుంది. ఇక ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు జరగాలని అభిమానులతో పాటు మాజీలు అందరూ కోరుకుంటున్నారు.
2004లో సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లొచింది. అప్పుడు భారత్ 2-1తో టెస్టు సిరీస్, 3-2తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. 2005లో భారత పర్యటనకు వచ్చిన పాక్ 3-2తో వన్డే సిరీస్ గెలుపొందగా.. టెస్టు సిరీస్ను డ్రాగా ముగించింది. చివరగా 2013లో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టీ20, వన్డే సిరీస్లు జరగ్గా.. పొట్టి సిరీస్ డ్రాగా ముగిసింది. వన్డే సిరీస్ 2-1 పాకిస్థాన్ కైవసం చేసుకుంది. అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఐసీసీ ఈవెంట్లలో తప్ప మరెక్కడా తలపడటం లేదు. 2019 వన్డే ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. అసియా కప్ జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది.
చివరిసారిగా భారత్, పాకిస్థాన్ జట్లు టీ20 ప్రపంచకప్ 2021లో ఎదురుపడ్డాయి. అది టీ20 చరిత్రలోనే అత్యధిక మంది వీక్షించిన మ్యాచుగా రికార్డు నెలకొల్పింది. ఇక ఇరు దేశాల మధ్య మళ్లీ ద్వైపాక్షిక సిరీస్ కోసం లక్షలాది అభిమానులు ఎదురుచూస్తున్న వేళ.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'భారత్- పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ గత కొన్నేళ్లుగా జరగడం లేదు. పాకిస్తాన్ బోర్టు లేదా భారత క్రికెట్ బోర్డు చేతిలో లేదు. ఐసీసీ ఈవెంట్లలో ఇరు జట్లు తలపడుతున్నా.. రెండింటి మధ్య అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు కొన్నేళ్లుగా జరగటం లేదు. దీనిపై ఇరు దేశాల ప్రభుత్వాలు స్పందించి నిర్ణయం తీసుకోవాలి. ఇది నా చేతుల్లో కానీ, రమీజ్ రాజా చేతుల్లో కానీ లేదు' అని దాదా అన్నాడు.
2007 నుంచి టీ20 ప్రపంచకప్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ భారత్, పాకిస్థాన్ జట్లు ఆరుసార్లు తలపడ్డాయి. ఈ ఐదింట్లో టీమిండియా విజయం సాధించగా.. పాక్ ఓ మ్యాచ్ గెలిచింది. మొత్తంగా ప్రపంచకప్లో పాక్పై 12-1తో రికార్డ్ని టీమిండియా కొనసాగిస్తోంది. మొత్తంగా అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకూ భారత్, పాకిస్థాన్ జట్లు 9 మ్యాచ్ల్లో తలపడగా.. టీమిండియా ఏడు మ్యాచ్ల్లో విజయం సాధించింది. రెండు మ్యాచ్లో మాత్రమే పాక్ గెలిచింది. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్ని ఓడించే భారత్ విజేతగా అవతరించింది.