అభివృద్ధికి బీసీసీఐ సహకారం
జమ్మూకశ్మీర్ క్రికెట్ సంఘం సీనియర్ అధికారితో పాటు కెప్టెన్ పర్వేజ్ రసూల్, మెంటార్ ఇర్ఫాన్ ఫఠాన్ సోమవారం ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో అధ్యక్షుడు గంగూలీని కలిశారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్లో క్రికెట్ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. రసూల్, ఇర్ఫాన్లు జమ్మూ సమస్యలను తెలపగా.. అక్కడి అభివృద్ధికి గంగూలీ పూర్తి భరోసానిచ్చారు.
గంగూలీ భరోసా
'మేం చెప్పిన సమస్యలు అన్ని గంగూలీ విన్నారు. స్థానిక క్రికెట్ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జమ్మూకశ్మీర్లో క్రికెట్ నిర్వహణకు తగిన సదుపాయాలు కల్పించాలని కోరాం, అందుకు సానుకూల స్పందన ఇచ్చారు. మరోసారి జమ్మూలో స్థానిక మ్యాచ్లు ఆడాలని భావిస్తున్నాం. జమ్మూకశ్మీర్ కళాశాల మైదానంను అభివృద్ధి చేసి, సరైన సదుపాయాలు కల్పిస్తాం. దీంతో ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది' అని భేటీ అనంతరం జమ్మూ సంఘం అధికారి పేర్కొన్నాడు. ఇటీవల జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్లో సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే.
గంగూలీ మార్కు
బీసీసీఐ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గంగూలీ అప్పుడే తన మార్కు మొదలుపెట్టేశాడు. జాతీయ క్రికెట్ అకాడమీ అభివృద్ధి, టీమిండియా తొలిసారి డే అండ్ నైట్ టెస్టు ఆడటం, కోట్లాది రూపాయిల ఖర్చుతో జరిగే ఐపీఎల్ వేడుకల్ని రద్దు చేయడం వంటి నిర్ణయాలు గంగూలీ తీసుకున్నారు. తాజాగా జమ్మూకశ్మీర్ క్రికెట్ అభివృద్ధికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
గంగూలీ పదవీ కాలం పొడగింపు?
గంగూలీ పదవీ కాలం తొమ్మిది నెలలే కావడంతో భారత క్రికెట్లో మార్పుకు అది సరిపోదని పాలకవర్గం భావిస్తోంది. కనీసం మూడేళ్ల పాటు దాదా అధ్యక్ష పదవిలో ఉంటే భారత క్రికెట్ రూపు రేఖలు మార్చగలడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ.. లోథా సంస్కరణలతో ఏర్పడిన బీసీసీఐ కొత్త రాజ్యాంగం గంగూలీ మూడేళ్లు కొనసాగేందుకు అనుమతించడం లేదు. అయితే బీసీసీఐ రాజ్యాంగానికి సవరణలు చేయాలని కొత్త పాలకవర్గం యోచిస్తున్నట్టు సమాచారం తెలుస్తోంది.