ఈ ఏడాది ఆఖరి వరకు కరోనాతోనే:
టీమిండియా టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్తో కలిసి లైవ్ (దాదా ఓపెన్స్ విత్ మయాంక్)లో పాల్గొన్న సౌరవ్ గంగూలీ పలు విషయాలు దేశ ప్రజలు, అభిమానులతో పంచుకున్నాడు. 'వైరస్ వ్యాప్తి ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. నా అంచనా ప్రకారం వచ్చే నాలుగు నెలలు చాలా కీలకం. ఈ ఏడాది ఆఖరి వరకు లేదా వచ్చే సంవత్సరం ప్రారంభం నాటికి వైరస్తో కలిసి మనం జీవించాల్సిందే. ఆ తర్వాత సాధారణ పరిస్థితులు ఏర్పడవచ్చు' అని గంగూలీ అన్నాడు.
ఒకవేళ వ్యాక్సిన్ వస్తే:
'కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చే వరకు నేను వేచిచూస్తా. అప్పటి వరకు మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. వైరస్ బారిన పడితే ఎలా ఉంటుందో మనందరికి తెలుసు. అనారోగ్యానికి గురికావడం నాకు ఇష్టం లేదు. అందరూ ఇలానే ఆలోచించాలి. ఉమ్మి (లాలాజలం)తోనే ప్రధాన సమస్య. ఒకవేళ వ్యాక్సిన్ వస్తే.. అంతా కుదురుకుంటుంది. అప్పడు ఇతర అనారోగ్య సమస్యల్లానే కరోనా ఉంటుంది' అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పారు. దాదా భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. ఇక ఐపీఎల్లో 59 మ్యాచ్లు ఆడాడు.
పేసర్లు రాణించడానికి ఫిట్నెస్ కారణం:
భారత పేసర్లు అద్భుతంగా రాణించడానికి ఫిట్నెస్ సంస్కృతిలో మార్పు రావడమే ప్రధాన కారణమని దాదా అన్నాడు. ఇక టీ20లు ఆడడం ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. 'టీ20లు ఎంతో కీలకం. ఇప్పటి తరంలో ఆడాల్సి వస్తే నా ఆటను కచ్చితంగా మార్చుకొనేవాడిని. ఎందుకంటే.. ఈ ఫార్మాట్లో బ్యాట్స్మన్ ఇష్టం వచ్చినట్టు బాదొచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడిన ఐదేళ్ల పాటు పొట్టి ఫార్మాట్ను ఆస్వాదించా. మరింతకాలం ఆడితే బావుండు అనిపిస్తోంది' అని గంగూలీ చెప్పాడు.
నేనే నాన్స్ట్రైకర్ ఎండ్లో నిలబడ్డా:
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓపెనర్గా స్ట్రైకింగ్ తీసుకోకపోవడానికి కారణాలను గంగూలీ తెలిపాడు. ‘సచిన్ ఎప్పుడూ స్ట్రైకింగ్ తీసుకోవడానికి ఆసక్తి చూపేవాడు కాదు. తొలి బంతిని ఫేస్ చేయమని నేనూ తరుచూ చెప్పేవాడిని. ఎందుకంటే ఎప్పుడూ నేనే స్ట్రైక్ తీసుకునేవాడిని. దానికి సచిన్ రెండు సమాధానాలు చెప్పేవాడు. అతను ఫామ్లో ఉంటే నాన్స్ట్రైక్లో ఉంటాననేవాడు. ఫామ్లో లేకున్నా నన్నే స్ట్రైకింగ్ తీసుకోమనేవాడు. తన మీద ఎలాంటి ఒత్తిడి ఉండకూడదని చెప్పేవాడు. అలా ఒకటి రెండు సార్లు నేనే నాన్స్ట్రైకర్ ఎండ్లో నిలబడ్డా' అని గంగూలీ గుర్తుచేసుకున్నాడు.
తరానికి ఓ ప్లేయర్ వస్తాడు.. దేశం ఆ ఆటగాడితో ఏకమవుతుంది: సెహ్వాగ్