కోల్కతా: తనను భారత జట్టు నుంచి తప్పించినా.. ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు అని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు. ఫిక్సింగ్ ఆరోపణలతో భారత్ జట్టు ఉక్కిరిబిక్కిరి అవుతున్న దశలో కెప్టెన్సీ అందుకున్న గంగూలీ.. టీమిండియాను అగ్రశ్రేణి జట్టుగా తీర్చిదిద్దారు. తనదైన నాయకత్వ లక్షణాలతో యువ ఆటగాళ్లకు అండగా నిలుస్తూ జట్టుకు ఎన్నో విజయాలందించారు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సారథిగా గుర్తింపు పొందారు.
అయితే సౌరవ్ గంగూలీని అప్పట్లో అవమానకరరీతిలో జట్టు నుంచి తప్పించారు. 2005లో అతని కెప్టెన్సీలోనే జింబాబ్వే పర్యటనకి వెళ్లిన టీమిండియా.. సిరీస్ గెలిచి సొంతగడ్డపై అడుగుపెట్టింది. ఆ వెంటనే గంగూలీని కెప్టెన్సీ నుంచి తప్పించడం.. ఆ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే జట్టులోనూ అతనిపై వేటు పడటం వేగంగా జరిగిపోయింది. దానికి కారణం అప్పటి కోచ్ గ్రేగ్ ఛాపెల్. ఇద్దరిమధ్య మనస్పర్థలు రావడంతో దాదాను తప్పించడంలో ఛాపెల్ కీలక పాత్ర పోషించారనడం బహిరంగ రహస్యమే. జట్టు నుంచి తప్పించడం పైన తాజాగా ఓ ఇంటర్వ్యూలో దాదా మాట్లాడారు.
'భారత జట్టులో నాపై వేటు పడినా.. ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నేను పరుగులు చేయగలను అని నాకు తెలుసు. అప్పటి కోచ్ గ్రేగ్ ఛాపెల్.. తన కెరీర్లో వసీమ్ అక్రమ్, గ్లెన్ మెక్గ్రాత్, షోయబ్ అక్తర్ లాంటి బౌలర్లని ఎదుర్కోలేదు. కానీ నేను వారిని ఎదుర్కొని పరుగులు చేశా. ఒక్కసారి కాదు దాదాపు 10 ఏళ్లు టాప్ క్లాస్ బౌలర్లని ఎదుర్కొన్నా. కాబట్టి మళ్లీ అవకాశం దొరికితే నిరూపించుకుంటానని నాకు తెలుసు. అయితే జట్టు నుంచి తప్పించడంపై మాత్రం అప్పట్లో చాలా బాధపడ్డాను. కానీ ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు' అని సౌరవ్ గంగూలీ చెప్పారు.
గ్రేగ్ చాపెల్ టీమిండియా కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. అనూహ్యంగా కెప్టెన్సీతో పాటు 2005లో జట్టులో చోటు కూడా కోల్పోయారు. అనంతరం దేశవాళీలో రాణించి మరసటి ఏడిదికే దక్షిణాఫ్రికా సిరీస్కు ఎంపికయ్యారు. బ్యాటింగ్లో రాణించారు. ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ కూడా దాదాను మెచ్చుకున్నారు. అయితే దాదాను తొలగించాలని బీసీసీఐకి చాపెల్ చేసిన మెయిల్ లీకవ్వడం అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపింది.
ఇక 2007-08 ఆస్ట్రేలియా పర్యటనకు ద్రవిడ్తో పాటు గంగూలీని ఎంపిక చేయలేదు. ఆ మరసటి ఏడాదే దాదా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పారు . ఇంటర్నేషన్ క్రికెట్ నుంచి తప్పుకున్నా డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్లో 2012 వరకు ఆడారు. భారత్ తరఫున 113 టెస్ట్లు, 311 మ్యాచ్లు ఆడిన దాదా.. సంప్రదాయక ఫార్మాట్లో 42.17 సగటుతో 7212 రన్స్ బాదారు. ఇందులో 16 సెంచరీలున్నాయి. ఇక వన్డేల్లో 41.02 సగటు, 22 సెంచరీలతో 11363 రన్స్ చేశారు.
వైరల్ ఫొటో.. సరికొత్తగా విరాట్ కోహ్లీ!!