మీరు ఎన్నో ఇచ్చారు.. ఇలాంటి విపత్కర సమయంలో వదిలి వెళ్తున్నందుకు క్షమించండి: కివీస్ మాజీ క్రికెటర్

ముంబై: ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వదిలి వెళ్తున్నందుకు భారతీయులు తనను క్షమించాలని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, స్టార్ కామెంటేటర్ సైమన్ డౌల్ ట్వీట్ చేశాడు. కరోనా సంక్షోభం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021ను భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) మంగళవారం అనూహ్యంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో విదేశీ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది తమ తమ స్వదేశాలకు బయల్దేరారు. ఈ క్రమంలో బుధవారం స్వదేశానికి పయనమైన ఐపీఎల్ కామెంటేటర్ సైమన్ డౌల్ ..భారత ప్రజలను ఉద్దేశించి ఓ భావోద్వేగ ట్వీట్ చేశాడు.
నన్ను క్షమించండి:
ఈ విపత్కర సమయాల్లో భారత ప్రజలు సురక్షితంగా ఉండాలని కామెంటేటర్ సైమన్ డౌల్ సూచించాడు. 'ప్రియమైన భారతీయులు.. మీరు ఎన్నో సంవత్సరాలుగా నాకు చాలా ఇచ్చారు. ఇలాంటి విపత్కర సమయాల్లో మిమ్మల్ని విడిచిపెట్టినందుకు నన్ను క్షమించండి. దయచేసి మీరు సురక్షితంగా ఉండటానికి చేయదగినది చేయండి. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు మాత్రం జాగ్రత్త వహించండి' అని డౌల్ తన ట్వీట్లో పేర్కొన్నారు. డౌల్ న్యూజిలాండ్ తరఫున 32 టెస్టులు, 42 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 98, వన్డేల్లో 36 వికెట్లు పడగొట్టాడు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ:
భారత్లో కరోనా మహమ్మారి వీర విహారం చేస్తోంది. ఐపీఎల్ 2021కు కరోనా సెగ తగలకూడదని బయో బబుల్లో ఆటగాళ్లను ఉంచి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి కరోనా సంక్షోభం కారణంగా ఈ లీగ్ను బీసీసీఐ అనూహ్యంగా వాయిదా వేసింది. భారత్లో కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండడంతో ఇదివరకే ఆడమ్ జాంపా, కేన్ రిచర్డ్సన్ వంటి పలువురు విదేశీ ఆటగాళ్లు టోర్నమెంట్ మధ్యలోనే తమ దేశాలకు పయనమయ్యారు.

రద్దు చేయలేదు:
ఐపీఎల్ 2021లో భాగంగా 60 మ్యాచ్లు జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా కేవలం 29 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. ఇద్దరు కేకేఆర్ ఆటగాళ్లుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ 29ను సోమవారం రీ షెడ్యూల్ చేశారు. ఆపై చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ ఆటగాళ్లకు కూడా కరోనా సోకడంతో లీగ్ మొత్తాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా ఐపీఎల్ 2021ని కేవలం వాయిదా మాత్రమే వేస్తున్నట్లు, రద్దు చేయలేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మంగళవారం స్పష్టం చేశారు.

మాల్దీవులకు ఆసీస్ ఆటగాళ్లు:
ఎనిమిది మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు తొలుత భారత్ గడప దాటగా.. మిగిలిన దేశాల ప్లేయర్లు బయలుదేరేందుకు వేచిచూస్తున్నారు. ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో ఆటగాళ్లను వారి దేశాలకు పంపడం బీసీసీఐకి సవాలుగా మారింది. మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లను మాల్దీవులకు పంపాలని భారత బోర్డు నిర్ణయించింది. ప్రత్యేక విమానంలో ఆసీస్ ఆటగాళ్లు మాల్దీవులకు చేరుకుంటారని ఓ ఫ్రాంచైజీకి చెందిన అధికారి వెల్లడించారు. ఇక తమ ఆటగాళ్లను క్షేమంగా ఇళ్లకు పంపేందుకు బీసీసీఐ చర్యలు తీసుకుంటున్నదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాత్కాలిక చీఫ్ నిక్ హ్యాక్లీ చెప్పారు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications