WTC Final 2021: అబ్బా వర్షం! 2019లో కేదార్ జాదవ్ చెప్పినట్లుగా.. ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చుగా?

హైదరాబాద్: ఇంగ్లండ్లోని సౌథాంప్టన్ ఏజిస్బౌల్ మైదానంలో శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు భారత్, న్యూజిలాండ్ జట్లు ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పోరులో తలపడనున్న సంగతి తెలిసిందే. అయితే ఉదయం నుంచి మ్యాచ్ జరిగే సౌథాంప్టన్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడంతో.. అంపైర్లు తొలి సెషన్ను (మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన తొలి సెషన్ను) రద్దు చేశారు. ఇదే విషయాన్ని ఐసీసీ ట్విటర్లో పంచుకోగా.. అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంగ్లండ్లోని వాతావరణ పరిస్థితులు జూన్లో సరిగా ఉండవని తెలిసినా.. అక్కడ కీలక మ్యాచ్లు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐసీసీపై ఫాన్స్ ఫైర్:
గతంలో ఇంగ్లండ్లో జరిగిన పలు ప్రతిష్ఠాత్మక మ్యాచుల సందర్భంగా వర్షాలు కురిసి అంతరాయం కలిగించిన సంఘటనలను కూడా అభిమానులు ఐసీసీకి గుర్తుచేశారు. 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలతో పాటు 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా వర్షం కురిసిందని చెప్పారు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సెమీస్ మ్యాచును కూడా ఉదాహరించారు. ఐసీసీ ట్రోఫీలోని కీలక మ్యాచ్లకు ఇంగ్లండ్ పరిస్థితులు ఏమాత్రం సరికాదని తెలిసినా.. పదే పదే ఐసీసీ ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తుందని కొందరు ఫాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు నెటిజెన్లు సరదా వీడియో, మీమ్స్తో ఆకట్టుకుంటున్నారు. అందులో ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వర్షాన్ని వెళ్లిపొమ్మని చెప్పొచ్చుగా:
2019 వన్డే ప్రపంచకప్ సమయంలో ఇంగ్లండ్ గడ్డపై ఉన్న టీమిండియా ప్లేయర్ కేదార్ జాదవ్.. మహారాష్ట్రకు వెళ్లొచ్చుగా అని వరుణ దేవుడిని వేడుకున్న విషయం తెలిసిందే. 'జాదవ్ మేఘాల వైపు చూస్తూ.. ఓ వర్షం ఇక్కడి నుండి మహారాష్ట్రకు వెళ్లొచ్చుగా' అని కోరాడు. ఆ సమయంలో మహారాష్ట్రలో వర్షపాతం చాలా తక్కువగా నమోదైంది. దాంతో అక్కడి జనాలు నీరు లేక అల్లాడిపోయారు. ఆ వీడియోను ఓ అభిమాని ఇప్పుడు పోస్ట్ చేసి.. 'కేదార్ జాదవ్ చెప్పినట్లుగా ఇప్పుడు కూడా ఎవరైనా ఒక టీమిండియా ప్లేయర్.. వర్షాన్ని వెళ్లిపొమ్మని చెప్పొచ్చుగా' అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వర్షం టాస్ గెలిచింది:
అభిమానులు భారత్, న్యూజిలాండ్ మ్యాచుపై తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. 'టీమిండియా, న్యూజిలాండ్ కాదు.. వర్షం టాస్ గెలిచింది. ఇరు జట్లపైన పైచేయి సాధించింది. ఇప్పుడు రెండు జట్ల ఫ్యాన్స్ ఏం చేస్తున్నారో తెలుసా?' అంటూ ఇద్దరు పిల్లలు బిక్క ముఖాలు వేసుకుని కన్నీరు కారుస్తున్న ఫొటోను ఓ నెటిజన్ షేర్ చేశారు. 'ఇదిగో ఇప్పుడు క్రికెట్ ఆడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది' అని గల్లీ క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి జారిపోయిన దృశ్యాలను మరో నెటిజన్ షేర్ చేశాడు.
7.30కు పిచ్ను పరిశీలించి:
ప్రస్తుతం ఏజిస్బౌల్ మైదానంలో వర్షం ఆగింది. అరగంటకు పైగా నుంచి అక్కడ వర్షం లేదు. ఆటగాళ్లు మైదానంలోకి వెళ్లి జాలిగా తిరుగుతుండగా.. సిబ్బంది పిచ్ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. రాత్రి 7.30కు అంపైర్లు పిచ్ను పరిశీలించి.. మూడో సెషన్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పనున్నారు. ఈ లోపు వరణుడు మరోసారి వస్తే.. తొలి రోజు ఆట తుడుచుకుపెట్టుకుపోయినట్టే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications