ఒంటరిగా వదిలేయండి:
అవార్డుల ప్రధానోత్సవం అనంతరం స్మృతి మంధాన మాట్లాడుతూ... 'అవార్డులు తీసుకునేటప్పుడు షెఫాలీ, నేను ఎదురెదురుగా నిలబడ్డాం. ఆ సమయంలో ఆమె చాలా భావోద్వేగం చెందింది. ఫైనల్లో మినహాయించి టోర్నీలో షెఫాలీ ఆడిన తీరుకు గర్వపడాలి. నేను మొదటిసారి ప్రపంచకప్ ఆడినప్పుడు షెఫాలీ కొట్టేదాంట్లో 20 శాతం కూడా కొట్టలేకపోయా. ఫైనల్లో తక్కువ పరుగులకే ఔటవ్వడంతో మనస్తాపం చెందింది. ప్రస్తుతం ఆమెను ఒంటరిగా వదిలేయండి' అని చెప్పారు.
ఓటముల నుంచే ఎక్కువ నేర్చుకోగలం:
'ఓటమికి గల కారణాలను తెలుసుకోవాల్సిన అవసరముంది. విజయాల కంటే ఓటముల నుంచే ఎక్కువ నేర్చుకోగలం. రాబోయే కాలంలో మంచి ప్రదర్శన చేసేందుకు ఆలోచించుకోవాలి. టీ20 ఫార్మాట్లో మేమెప్పుడూ మంచి ప్రదర్శన చేయలేదు. వన్డేలే మా బలం. ఇప్పుడు మాత్రం టీ20, వన్డేలను సమానంగా ఆడుతున్నాం. ఈ విషయంలో కోచ్ డబ్ల్యూవీ రామన్ చాలా సహకరించారు. జట్టుగా చాలా మెరుగయ్యాం' అని మంధాన తెలిపింది.
యువ క్రికెటర్ల రాకతో మార్పులు చోటుచేసుకున్నాయి:
'యువ క్రికెటర్లు జట్టులోకి రావడంతో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ టోర్నీలో ఏదైనా మంచి జరిగిందంటే అది కచ్చితంగా జట్టు సమష్టిగా రాణించడమే. రామన్ ఇదే చేశారు. ఒకరిద్దరు మాత్రమే కాకుండా జట్టంతా కలిసికట్టుగా రాణించేలా ఆయన ఎంతో కష్టపడ్డారు. ఈ రోజు సరిగ్గా ఆడకపోయినా.. టీమిండియా మెరుగైన స్థితికి చేరుకుంది' అని సీనియర్ ఓపెనర్ చెప్పుకొచ్చింది. ఫైనల్లో షెఫాలీ, మంధాన ఇద్దరూ విఫలమయిన విషయం తెలిసిందే.
85 పరుగుల తేడాతో ఓటమి:
మొదటగా బ్యాటింగ్కు చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఎలీసా హేలీ (39 బంతుల్లో 75; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), బెత్ మూనీ (54 బంతుల్లో 78 నాటౌట్; 10 ఫోర్లు) చితకొట్టారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ (1/30) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. మరో స్పిన్నర్ దీప్తి శర్మ (2/38) ఫర్వాలేదనిపించింది. అనంతరం లక్ష్య ఛేనలో భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. దీప్తి శర్మ (33; 2 ఫోర్లు) టాప్ స్కారర్. ఆసీస్ బౌలర్లలో షుట్ (4/18), జెస్ జొనాసెన్ (3/20) రాణించారు.