టోర్నీలో జోష్ కోసం
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ 2020 సీజన్ని బీసీసీఐ యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే. అయితే స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించడం యూఏఈ గవర్నమెంట్ ఇష్టమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇంగ్లీష్ గడ్డపై బయో బబుల్ వాతావరణంలో వెస్టిండీస్-ఇంగ్లడ్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ మంగళవారం విజయవంతంగా ముగిసింది. ఈ సిరీస్కి ప్రేక్షకుల్నిఇంగ్లడ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అనుమతించలేదు. అయితే నెలన్నర పాటు జరిగే ఐపీఎల్లో పరిమిత సంఖ్యలో ప్రేక్షకుల్ని అనుమతిస్తే.. ఆటగాళ్లతో పాటు టోర్నీలోనూ జోష్ ఉంటుందని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.
అభిమానుల్ని అనుమతించాలి
ఐపీఎల్ 2020 సీజన్కి పరిమిత సంఖ్యలో అభిమానుల్ని అనుమతించాలని తాజాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ సహ యజమాని నెస్ వాడియా కోరారు. 'ఐపీఎల్ 2020కి అభిమానులను అనుమతించే విషయంలో తుది నిర్ణయం యూఏఈ గవర్నమెంట్దే. యూఏఈలో అధునాతమైన వైరస్ టెస్టింగ్ మిషన్లు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని నేషనల్ బాస్కెట్బాల్ అసోషియేషన్లు పరిమిత సంఖ్యలో ప్రేక్షకుల్ని స్టేడియాల్లోకి అనుమతిస్తున్నాయి. ఐపీఎల్కి కూడా అభిమానులను అనుమతిస్తే బాగుంటుంది. మొదటి ప్రాధాన్యత మాత్రం ఐపీఎల్ జరగడమే' అని నెస్ వాడియా పేర్కొన్నారు.
ప్రతిరోజూ వైరస్ పరీక్షలు చేయాలి
అంతకుముందు ఐపీఎల్ 2020 సీజన్ సమయంలో క్రికెటర్లకి ప్రతిరోజూ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని నెస్ వాడియా డిమాండ్ చేశారు. 'ఐపీఎల్ జరిగే సమయంలో మైదానంలోనూ, మైదానం బయట కూడా కచ్చితమైన ఆరోగ్య పరిరక్షణ నిబంధనలు పాటించాలి. ఇందులో ఏమాత్రం రాజీ పడరాదు. సాధ్యమైనంత ఎక్కువగా కరోనా పరీక్షలు జరపాలి. సరిగ్గా చెప్పాలంటే ప్రతి రోజూ నిర్వహిస్తే మంచిది. నేనే ఆటగాడినైతే ఎలాంటి అభ్యంతరం చెప్పను' అని అన్నారు.
ఆగస్టు 2న సమావేశం
ఐపీఎల్ 2020 ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చించడానికి ఐపీఎల్ పాలకమండలి ఆగస్టు 2న సమావేశం జరగనుందని లీగ్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ మీడియాకు వెల్లడించారు. మ్యాచ్లను కుదించాలంటే ఏమేరకు చేయాలి.. రోజుకు రెండు చొప్పున మ్యాచ్లు ఎన్ని పెట్టాలి.. దాదాపు రెండు నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండటం ఇబ్బందన్న అభిప్రాయాల నేపథ్యంలో ఆటగాళ్లతో పాటు భార్యాపిల్లల్ని అనుమతించాలా వద్దా అనే విషయాల్ని ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆగస్టు 2న పూర్తి స్పష్టత రానుంది.