పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక మధ్య గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో శ్రీలంక ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. తొలి టెస్ట్లో ఓటమిని.. రెండో టెస్టులో గెలుపుతో లెక్క సరిచేయలని శ్రీలంక ప్లేయర్లు కసి కనబర్చుతున్నారు. తొలిరోజు 6వికెట్ల నష్టానికి 315పరుగులు చేసిన శ్రీలంక.. ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించి.. భారీ స్కోరు దిశగా స్కోరుబోర్డును మలచలేకపోయింది. మరో 63పరుగులు మాత్రమే చేసి 378పరుగులకు శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ముగిసింది. బ్యాటర్ డిక్వెల్లా (51) హాఫ్ సెంచరీతో పర్లేదనిపించాడు. ఇక బౌలర్ రమేశ్ మెండిస్ సైతం 35పరుగులు చేసి జట్టు స్కోరుకు కాస్త ఊతమిచ్చాడు.
ఇక ఎప్పటిలాగే బౌలింగ్లో తమ హవా చూపించాలనుకున్న శ్రీలంక అనుకున్నట్లుగానే ప్రదర్శన చేస్తుంది. బ్యాటింగ్కు దిగిన పాక్ బ్యాటర్లను స్పిన్ మాయాజాలంతో స్పిన్నర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్లో 7వికెట్లు కోల్పోయి 191పరుగులు చేయగలిగింది. ఇంకా ఆ జట్టు 187పరుగుల వెనకబడి ఉంది. తొలి టెస్ట్లో వీరోచిత సెంచరీతో పాక్ను గెలిపించిన అబ్దుల్లా షఫీక్ డకౌటయ్యాడు. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (32), కెప్టెన్ బాబర్ ఆజమ్ (16), మహ్మద్ రిజ్వాన్ (24), ఫవాద్ ఆలం (24) స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయారు. అయితే అఘా సల్మాన్ (62పరుగులు 126బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సర్) కాసేపు మొండిగా క్రీజులో నిలబడ్డాడు. ప్రభాత్ జయసూర్య అతన్ని బురిడీ కొట్టించాడు. శ్రీలంక స్పిన్నర్లలో రమేశ్ మెండిస్ 3, ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తీయగా, ఆశిత ఫెర్నాండో, ధనుంజయ డిసిల్వా తలా ఓ వికెట్ తీశారు.
తొలి రోజు టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుని ఆరు వికెట్లు కోల్పోయి 315పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ఓషాదో ఫెర్నాండో (50పరుగులు), కెప్టెన్ దిముత్ కరుణరత్నే (40పరుగులు), ఏంజెలో మాథ్యూస్ (42), దినేష్ చండిమాల్ (80), ధనుంజయ డిసిల్వా (33) రాణించారు. పాక్ బౌలర్లలో మహమ్మద్ నవాజ్ 2, యషీర్ షా, నషీమ్ షా, నౌమన్ అలీ తలా ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్కు షాహిన్ అఫ్రిది దూరమైన సంగతి తెలిసిందే.