న్యూఢిల్లీ: వెస్టిండిస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఆన్లైన్ పోల్లో రిచర్డ్స్తో పోటీపడిన సచిన్ టెండూల్కర్ రెండో స్ధానానికే పరిమితమయ్యాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్పో మంత్లీ మ్యాగజైన్ 'క్రికెట్ మంత్లీ' నిర్వహించిన పోల్లో పాల్గొన్న 50 మంది న్యాయనిర్ణేతల్లో 29 మంది రిచర్డ్స్కు ఓటేశారు.
మూడో స్ధానంలో పాకిస్ధాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ నిలిచాడు. నాల్గవ స్ధానంలో ఆస్టేలియాకు చెందిన మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ నిలవగా, ఐదవ స్ధానంలో టీమిండియా ప్రస్తుత కెప్టెన్ ధోని నిలిచాడు. 'గ్రేటేస్ట్ వన్డే క్రికెటర్' విజేతను ఎంపిక చేసే ప్యానెల్లో క్రికెటర్లతో పాటు, కామెంటేటర్లు, క్రికెట్ రచయితలు కూడా ఉన్నారు.
ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ ఈఎస్పీఎన్ 'క్రిక్ఇన్ఫో' ఆధ్వర్యంలోని 'క్రికెట్ మంత్లీ' మేగజైన్ ఈ ఎంపిక ప్రక్రియను నిర్వహించింది. 23 ఏళ్ల క్రికెట్ కెరీర్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎన్నో రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. 463 వన్డే మ్యాచ్లాడిన సచిన్, 44.83 సగటుతో 18,426 పరుగులు సాధించాడు.
వన్డే క్రికెట్లో 49 సెంచరీలను తన పేరిట నమోదు చేశాడు. వీటిల్లో ఒక డబుల్ సెంచరీ ఉండటం విశేషం. వన్డే క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా సచిన్ చరిత్ర సృష్టించాడు. ఇక వన్డేల్లో 96 అర్ధ సెంచరీలు సాధించాడు. వన్డే క్రికెట్లో ఒంటి చేత్తో మ్యాచ్ను విజయతీరాలకు చేర్చగలిగే సత్తా ఉన్న క్రికెటర్ ధోని.
టాప్ ఐదుగురిలో చోటు దక్కించుకున్న ఈ కాలపు ఆటగాడు ధోని కావడం విశేషం. 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ధోని ఆడిన ఇన్నింగ్స్ భారత్కు ప్రపంచకప్నే సాధించి పెట్టాడు. ఇక ఆస్టేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ 12 ఏళ్లు క్రికెట్కు తన సేవలందించాడు.
1996 నుంచి 2008 మధ్య కాలంలో ఆస్టేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2007 వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్లో శ్రీలంకపై ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. ఇక 70, 80 దశకాల్లో వివియన్ రిచర్డ్స్ వన్డే క్రికెట్లో హీరోగా పేరుగాంచాడు. వెస్టిండిస్కు 1975, 79ల్లో వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.