ఆ వాక్యాలు చదివినప్పుడు బాధేసింది:
తాజాగా శుభ్మన్ గిల్ ఫోర్బ్స్ ఇండియాతో మాట్లాడుతూ... 'డే/నైట్ టెస్టులో టీమిండియా 36కు ఆలౌటైనప్పుడు అందరం ఒక్కసారిగా షాకయ్యాం. అత్యంత వేగంగా కుప్పకూలడంతో ఎలా స్పందించాలో తెలియలేదు. ఆ టెస్ట్ ఓటమి నుంచి బయటపడేందుకు మాకు ఏమాత్రం సమయం దొరకలేదు. మ్యాచులో మంచి స్థితిలో ఉండగా.. ఒకే ఒక్క గంటలో అంతా మారిపోయింది. ఒక్కసారిగా వికెట్ల పతనం మొదలైంది. మీడియాలో ది గ్రేట్ అడిలైడ్ కొలాప్స్ అనే వాక్యాలు చదివినప్పుడు ఎంతో బాధేసింది. ఈ సిరీసును గుర్తుపెట్టుకోవద్దని అనిపించింది' అని చెప్పాడు.
నిద్రమాత్ర వేసుకున్నా:
'మెల్బోర్న్లో అరంగేట్రం చేస్తానని అడిలైడ్ మ్యాచుకు ముందే తెలుసు. దాంతో మ్యాచుకు ముందు రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. దాంతో నిద్రమాత్ర వేసుకున్నా. ఉదయం తొలుత ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. జట్టంతా మైదానంలో ఉండటంతో.. నాకు అరంగేట్రం చేస్తున్న అనుభూతి కలగలేదు. సాయంత్రం బ్యాటింగ్కు దిగినప్పుడు 10-12 బంతులు ఎదుర్కొన్నంత వరకు అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నానన్న ఆత్రుత కలిగింది. అత్యుత్తమ బౌలింగ్ దాడిని ఎదుర్కొంటున్నట్టు అనిపించింది. నేను మరింత శ్రద్ధగా ఆడాలని ఆ తర్వాత నాకు నేనే చెప్పుకున్నా. అలాగే ఆడాను. కానీ భారీ స్కోర్ చేయలేకపోయా' అని గిల్ తెలిపాడు.
మూడు వన్డేలు, మూడు టెస్టులు:
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ను యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ప్రశంసలతో ముంచెత్తాడు. ఆస్ట్రేలియా సిరీస్లో రాణించడానికి యువరాజ్ ఇచ్చిన ట్రైనింగ్ ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నాడు. క్యాంప్లో భాగంగా వందల సంఖ్యలో షార్ట్ పిచ్ బంతులు విసిరి యూవీ తనతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించాడని చెప్పాడు. గిల్ ఇప్పటివరకు భారత్ తరఫున మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడాడు.
మూడు టెస్టుల్లో 259 పరుగులు:
ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తొలి టెస్టులో విఫలమవడంతో అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని శుభ్మన్ గిల్ ఒడిసిపట్టాడు. మూడు టెస్టు మ్యాచ్లాడి 259 పరుగులు చేశాడు. ముఖ్యంగా నాలుగో టెస్టు జరిగిన గబ్బా మైదానంలో గిల్ 91 పరుగుల కీలక ఇన్నింగ్స్ టీమిండియా విజయానికి బాటలు వేసింది. ఆసీస్ పర్యటన ప్రదర్శనతో స్వదేశంలో ఇంగ్లడ్తో జరిగే టెస్ట్ సిరీస్లో చోటు దక్కించుకున్నాడు. ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి టెస్టు జరగనుంది. అందులోనూ గిల్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు.