న్యూఢిల్లీ: మైదానంలో తనదైన బ్యాటింగ్తో పరుగుల వరద పారిస్తున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సొంతం చేసుకున్నాడు. సొంతగడ్డపై గత నెల వెస్టిండీస్తో ఆ తర్వాత శ్రీలంకతో అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. వెస్టిండీస్తో మూడో వన్డేలో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన (80 పరుగులు) సహా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆఖరి మ్యాచ్లో 16 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు అయ్యర్. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్లో మూడు మ్యూచ్ల్లోనూ 57, 74, 73 పరుగులతో నాటౌట్గా నిలిచి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు.
ఈ పెర్ఫామెన్స్తో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో నిలిచిన అయ్యర్కు అభిమానులు తమ ఓట్లతో ఈ అవార్డు కట్టబెట్టారు. మహిళల విభాగంలో న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమెలియా కెర్ను ఈ అవార్డు వరించింది. గత నెలలో భారత్తో జరిగిన వన్డే సిరీస్లో కేర్ అద్భుతంగా రాణించింది. శ్రీలంకతో తాజాగా ముగిసిన డే/నైట్ టెస్ట్లోనూ అయ్యర్ అదరగొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 92 పరుగులతో తృటిలో సెంచరీ చేజార్చుకున్న అతను.. రెండో ఇన్నింగ్స్లో 67తో మరో హాఫ్ సెంచరీ బాదాడు. దాంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు.
శ్రీలంకతో రెండు సిరీస్ల్లో సూపర్ బ్యాటింగ్తో రాణించిన శ్రేయస్ అయ్యర్పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. అతను ఎంతో మెరుగయ్యాడని చెప్పుకొచ్చాడు. 'శ్రీలకంతో టీ20 సిరీస్ ఫామ్నే శ్రేయస్ అయ్యర్ టెస్ట్ సిరీస్లోనూ కొనసాగించాడు. అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా వంటి స్టార్ బ్యాట్స్మన్ స్థానాల్లో ఆడుతున్నాననే విషయం శ్రేయస్కు తెలుసు. వారి స్థానాలను భర్తీ చేయగల సామర్థ్యాలు అతనిలో ఉన్నాయి. కెరీర్ ప్రారంభానికి ఇప్పటికీ అతను ఎంతో మెరుగయ్యాడు.'అని హిట్ మ్యాన్ ప్రశంసించాడు.
447 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 208 పరుగులకే కుప్పకూలింది. లంక్ కెప్టెన్ దిముత్ కరుణ రత్నే(174 బంతుల్లో 15 ఫోర్లతో 107) సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. కుశాల్ మెండీస్(60 బంతుల్లో 8 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్కు రెండు, రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది. ఈ విజయంతో రెండు టెస్ట్ల సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. రెండున్నర రోజుల్లో గులాబీ టెస్ట్ ముగియడం విశేషం. ఇక సొంతగడ్డపై భారత్కు ఇది వరుసగా 15వ టెస్ట్ సిరీస్ విజయం కావడం గమనార్హం.