ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాల్పై వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కానీ అతన్ని జట్టుకు దూరంగా ఉంచారనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. అప్కమింగ్ ఐపీఎల్ 2026 సీజన్కు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉండగా.. యశ్ దయాల్ ఇంకా ఆర్సీబీ ప్రాక్టీస్ క్యాంప్లో పాల్గొనలేదు. టీమ్ బస్సుపై కూడా యశ్ దయాల్ మినహా జట్టులోని ఆటగాళ్లందరి ఫొటోలు ఉండటం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై ఐదేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని ఓ యువతి యశ్ దయాల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే మరో అమ్మాయి కూడా తనను అత్యాచారం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. ఆమె వయసు 17 ఏళ్లే కావడంతో పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఈ రెండు కేసుల నేపథ్యంలోనే యశ్ దయాల్పై ఆర్సీబీ వేటు వేసినట్లు అర్థమవుతుంది. అతని స్థానంలో ఉమేశ్ యాదవ్ను తీసుకోవాలని టీమ్మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయితే అతనికి కొన్ని ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయని, దాంతోనే యశ్ దయాల్కు ప్రత్యామ్నాయ ప్లేయర్ ఎవరా? అనేది ఆర్సీబీ తేల్చుకోలేకపోతుందంట.
అత్యాచారం కేసులో అరెస్టు అయి బెయిల్పై బయటకు వచ్చిన యశ్ దయాల్.. గత నెల సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడు. ఫిబ్రవరి 4న నోయిడాలో పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. యశ్ దయాల్ పెళ్లికి క్రికెటర్లు ఎవ్వరూ హాజరుకాలేదు.
యశ్ దయాల్.. తన పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అతని భార్య శ్వేతా పుందిర్ ఇన్స్టా రీల్ ద్వారా తమ పెళ్లి విసయాన్ని బయటపెట్టింది. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ అయిన శ్వేతా పుందిర్కి ఇన్స్టాగ్రామ్లో సుమారు 6 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ లెజెండ్స్ లీగ్లో బ్రాడ్ కాస్టర్గా కూడా ఆమె వ్యవహరించింది.
ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలవడంలో యశ్ దయాల్ 13 వికెట్లతో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగిన యశ్ దయాల్.. రింకూ సింగ్ ధాటికి వరుసగా ఒకే ఓవర్లో 5 సిక్సర్లు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత తీవ్ర డిప్రెషన్కు గురైన యశ్ దయాల్ కొన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్నాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో యశ్ దయాల్ను ఆర్సీబీ రూ.3.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయగా.. అతను 15 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. దాంతో ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రూ.5 కోట్లకు యశ్ దయాల్ను రిటైన్ చేసుకుంది. ఆట పరంగా యశ్ దయాల్ తిరుగులేదు. కానీ అనవసర కేసులతో తన కెరీర్ను నాశనం చేసుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.