|
ముంబైతో మ్యాచ్లో 5 మార్పులతో బరిలోకి కేకేఆర్
ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు ముందు కేకేఆర్ జట్టులో 5మార్పులు చోటుచేసుకున్నాయి. అజింక్యా రహానే, ప్యాట్ కమిన్స్, వెంకటేష్ అయ్యార్, వరుణ్ చక్రవర్తి, షెల్డన్ జాక్సన్ టీంలోకి వచ్చారు. ఇన్ని మార్పులతో కేకేఆర్ బరిలోకి దిగడం ఆశ్చర్యకరంగా అన్పించింది. మ్యాచ్ గెలిచాక మురళీ కార్తీక్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అభిప్రాయాలు తెలుసుకుంటూ.. ప్లేయర్లను తుది జట్టులో ఎంపిక చేసేటప్పుడు ఎలా ఫీలవుతావు అని అడిగాడు. దీనిపై శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. తుది జట్టు కూర్పు అంత సులభం కాదని అంగీకరించాడు. కొన్ని సమయాల్లో ఫ్రాంచైజీ సీఈవో వెంకీ మైసూర్ కూడా జట్టు ఎంపికలో పాల్గొంటారని అతను వెల్లడించాడు.
|
భారీ తేడాతో గెలవడం సంతోషం
'ప్లేయర్లు తుది జట్టులో ఆడతారో లేదో చెప్పడం నిజంగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్లు నిరాశచెందుతారేమోనని ఫీలవుతుంటాం. తుది సెలక్షన్ విషయంలో జట్టు కోచ్ల సహాయం తీసుకుంటాం. పిచ్ రిపోర్ట్, ఆటగాళ్ల ఫామ్ అన్నింటినీ బేరీజు వేసుకుంటాం. అప్పుడే తుది జట్టును ఎంపిక చేసుకుంటాం. కోచ్లతో పాటు కొన్నిసార్లు జట్టు సీఈవో కూడా సెలక్షన్ విషయంలో చొరవ తీసుకుంటారు' అని శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం మురళీ కార్తీక్తో చెప్పాడు.
|
శ్రేయస్ వ్యాఖ్యలపై నెట్టింట సెటైర్లు
ఒక జట్టు సెలక్షన్లో ఫ్రాంచైజీ సీఈవో కలగజేసుకోవడం ఏంటో విడ్డూరంగా ఉందని పలువురు నెటిజన్లు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరు అయితే సీఈవో కలగజేసుకునే విషయాన్ని శ్రేయస్ ప్రస్తావించడం వల్ల తర్వాతి సీజన్లో శ్రేయస్ కెప్టెన్ పదవికి ఎసరు తప్పదని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఫ్రాంచైజీ సీఈవోలు ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకోవడాన్ని సమర్థిస్తుంటే మరికొందరు తప్పుపడుతున్నారు. ఫ్రాంచైజీలో జట్టు సెలక్షన్ అనేది కెప్టెన్ నిర్ణయం కాదా ఇప్పటివరకు మేము అలాగే అనుకున్నామంటూ కొందరు దెప్పిపొడుస్తున్నారు.