180 పరుగుల భారీ తేడాతో పాక్ విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ 2017 టోర్నీలో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అద్భుతంగా ఆడింది. లీగ్ మ్యాచ్లో పాక్ను చిత్తుచిత్తుగా ఓడించింది. అయితే ఫైనల్లో అదే జట్టు చేతిలో ఘోరంగా ఓడిపోయింది. 339 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ విఫలమయ్యారు. చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్తో ఆశలు రేపినా.. రవీంద్ర జడేజాతో సమన్వయ లోపంతో పెవిలియన్ చేరుకున్నాడు. పాక్ 180 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. పాక్ పేసర్ మొహమ్మద్ అమిర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ట్రోఫీ గెలవడం అద్భుతమైన అనుభూతి
పాకిస్థాన్ విజయం సాధించిన తర్వాత యువరాజ్సింగ్ తనతో ఏం మాట్లాడాడో షోయబ్ మాలిక్ గుర్తు చేసుకున్నాడు. మాలిక్ తాజాగా పాక్పాషన్.నెట్తో మాట్లాడుతూ.. '2017 ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం అద్భుతమైన అనుభూతి. ఐసీసీ ట్రోఫీని గెలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. కానీ నాకు మరో మధుర స్మృతి ఉంది' అని చెప్పాడు. మాలిక్ పాక్ తరఫున 35 టెస్టులు, 287 వన్డేలు, 113 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 12 శతకాలు, 60 అర్ధ శతకాలు నమోదు చేశాడు.
వారితో కలిసి వేడుక చేసుకో
'ఫైనల్ మ్యాచ్ ముగిశాక భోజనశాలలో యువరాజ్ సింగ్తో మాట్లాడాను. మీ జట్టు సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రత్యేక సందర్భాన్ని అస్సలు మిస్సవ్వకు. ఇక్కడి నుంచి వెళ్లి వారితో కలిసి వేడుక చేసుకో అని యువీ నాతో చెప్పాడు. క్రికెట్ ఎలాంటి స్నేహాలను అందిస్తుందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది ముఖ్యం కాదు' అని మాలిక్ అన్నాడు. భారత్, పాక్ క్రికెట్ వైరాన్ని తాము చాలా మిస్సవుతున్నామని మాలిక్ పేర్కొన్నాడు. యాషెస్ సిరీస్ లేకుండా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ను ఊహించుకోగలవా అని ప్రశ్నించాడు. భారత్-పాక్ సిరీసులు సైతం అంతే రసవత్తరంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నాడు.
హైదరాబాద్ వచ్చేందుకు సన్నాహాలు
భార్య సానియా మీర్జా, కుమారుడు ఇజాన్ను చూసివచ్చేందుకు షోయాబ్ మాలిక్కు ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనుమతించింది. త్వరలో హైదరాబాద్ వచ్చేందుకు షోయాబ్ సన్నాహాలు పూర్తిచేసుకొన్నట్టు తెలుస్తున్నది. భార్య, కుమారుడితో కొన్ని రోజులు గడిపిన తర్వాత నేరుగా ఇంగ్లండ్కు వెళ్లి జట్టుతో చేరనున్నాడు. అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకోగానే కేంద్ర ప్రభత్వం లాక్డౌన్ నిర్ణయం తీసుకోవడంత కుమారుడితో సానియా మీర్జా హైదరాబాద్లో ఉండిపోయారు. కాగా షోయాబ్ మాలిక్ పాకిస్తాన్లో ఉన్నాడు. పాకిస్తాన్ జట్టు ఈ నెల 28 న ఇంగ్లండ్ మాంచెస్టర్ బయలుదేరుతుంది.