ఇస్లామాబాద్: రావల్పిండిలో వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు భద్రతా కారణాలతో న్యూజిలాండ్ టీమ్ తన టూర్ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో పాక్ గడ్డ 2003 తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్లకు వేదిక అవుతుందనుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్ వ్యవహరించిన తీరు పట్ల పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కివీస్పై మండిపడుతున్నారు. పాకిస్థాన్ క్రికెట్ను న్యూజిలాండ్ చంపేసిందని పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నారు. తమపై కావాలనే కుట్రలు పన్నుతున్నారన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ పర్యటనలో కివీస్ మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడాల్సింది.
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కివీస్ సిరీస్ రద్దు చేసుకోవడంపై ట్విటర్లో ఘాటుగా స్పందించారు. 'న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ క్రికెట్ను చంపేసింది. అర్థంతరంగా సిరీస్ రద్దు చేసుకున్న కివీస్ జట్టును ముందుగా నేను కొన్ని ప్రశ్నలు అడగలనుకుంటున్నా. క్రైస్ట్చర్చిలో జరిగిన పేలుడులో 9 మంది పాకిస్తానీలు చనిపోయారు. మరి అప్పుడు మీకు భద్రత గుర్తుకురాలేదా?. అంతేగాక ఈ విషయంలో అప్పట్లో పాకిస్తాన్ న్యూజిలాండ్కు మద్దతుగా నిలిచింది. కరోనా సంక్షోభం జోరుగా ఉన్న సమయంలో మేం మీ దేశంలో పర్యటించాం. అప్పడు మా ఆటగాళ్లకు మీ అధికారులు ఇచ్చిన భద్రత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఉన్నపళంగా సిరీస్ రద్దు చేసుకోవడం ఏంటో అర్ధం కావట్లేదు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షేక్ రషీద్ అహ్మద్.. కివీస్ సిరీస్ రద్దుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ... 'మాపై కావాలనే కుట్రలు పన్నుతున్నారు. కొన్ని అతీత శక్తులు మా దేశంలో క్రికెట్ జరగకుండా అడ్డుపడుతున్నాయి. అఫ్గానిస్తాన్లో చోటుచేసుకున్న పరిణామాల అనంతరం మా దేశంపై బురద జల్లుతున్నారు. ఉన్నపళంతగా కివీస్ సిరీస్ రద్దు చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. వాళ్లు భద్రతా కారణాలు అనే సాకు చూపుతున్నారు. కానీ భద్రత విషయంలో పీసీబీ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కివీస్ బోర్డుకు ఎటువంటి నష్టం కలగకుండా ఆటగాళ్లను జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇచ్చింది. అయినప్పటికీ భద్రత అనే అంశాన్ని లేవనెత్తి మమ్మల్ని అవమానించారు' అని అసహనం వ్యక్తం చేశారు.
NZ just killed Pakistan cricket 😡😡
— Shoaib Akhtar (@shoaib100mph) September 17, 2021
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా తన నిర్వేదాన్ని వ్యక్తం చేశాడు. అకస్మాత్తుగా సిరీస్ను వాయిదా వేయడం బాధాకరమని, ఈ సిరీస్ జరిగితే లక్షలాది మంది పాక్ క్రికెట్ అభిమానులు సంతోషించేవారన్నాడు. తమ సెక్యూర్టీ సామర్థ్యంపై నమ్మకం ఉన్నట్లు బాబర్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. న్యూజిలాండ్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది ఖండించారు. ఉత్తుత్తి బెదిరంపు కాల్తో కివీస్ టూర్ను రద్దు చేసుకుందని, దీని వల్ల ఎంత నష్టం అవుతుందో తెలుసా? అని అఫ్రీది ట్వీట్ చేశారు. మొత్తానికి చాలా సంవత్సరాల తర్వత ఒక విదేశీ జట్టు మా గడ్డపై అడుగుపెట్టిందన్న ఆనందం పీసీబీకి మిగలకుండా పోయింది.