క్రికెట్ను ఐసీసీ నాశనం చేసింది:
భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్తో తాజాగా క్రిక్ఇన్ఫో పొడ్క్యాస్ట్లో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. తన మనసులోని మాటను బయటపెట్టాడు. టీ20ల్లో ఫాస్ట్ బౌలర్ల వేగం తగ్గింది కదా అని మంజ్రేకర్ అడగ్గా.. ఐసీసీపై అక్తర్ ఫైర్ అయ్యాడు. 'మొహమాటం లేకుండా మీకో విషయం చెప్పనా?.. ఐసీసీ విజయవంతంగా క్రికెట్ను నాశనం చేసింది. ఈ విషయాన్ని నేను బహిరంగంగా చెబుతున్నా. గత పదేళ్లలో ఐసీసీ విజయవంతంగా క్రికెట్ను ముగించేసింది. అందుకే నేను వారిని వెల్డన్ అంటున్నా. ఎందుకంటే.. వారేం అనుకున్నారో అదే చేశారు' అని అక్తర్ అన్నాడు.
సచిన్ వర్సెస్ షోయబ్ పోటీలు ఎక్కడ:
'ఓవర్కు ఒక బౌన్సర్ నిబంధన మార్చాలని పదేళ్లుగా చెబుతూనే ఉన్నా. ఎవరూ పట్టించుకోవడం లేదు. రెండు కొత్త బంతులు, బయట నలుగురు ఫీల్డర్లు ఉంటున్నారు. క్రికెట్ నాణ్యత పెరిగిందా? తగ్గిందా? అని ఐసీసీని అడగండి. సచిన్ టెండూల్కర్ వర్సెస్ షోయబ్ అక్తర్ తరహా పోటీలు ఇప్పుడు ఎక్కడైనా కనబడుతున్నాయా?' అని అక్తర్ ప్రశ్నించాడు. 'నేనెప్పుడూ సచిన్ను గౌరవిస్తా. అయితే నా ఆలోచనల్లో మాత్రం అతన్ని ఓడించేందుకు ప్రయత్నిస్తా. 2006 పాక్ పర్యటనలో సచిన్ ఎల్బో గాయంతో బాధపడుతున్నాడని తెలిసి పరుగులు చేయకుండా బౌన్సర్లు సంధించా. అప్పుడు అలా గేమ్ రసవత్తరంగా సాగేది' అని మాజీ పేసర్ పేర్కొన్నాడు.
నాలాంటి వాళ్లు పీసీబీలో ఉండాలి:
పాకిస్థాన్లో ఇంకా స్పీడ్స్టర్స్ వస్తున్నారా? అని సంజయ్ మంజ్రేకర్ ప్రశ్నించగా... 'నాలాంటి వాళ్లు పీసీబీలో ఉండాలి. నేనైతే ఫాస్ట్ బౌలర్లను తయారుచేసేవాడిని. పేసర్లు చిరుత పులుల్లా ఉండాలి. నేనే కనుక అక్కడ ఉంటే.. ఓ డజన్ మంది ఫాస్ట్ బౌలర్లను రూపొందించేవాడిని. గులాంగిరీ చేసేవాళ్ల దగ్గర్నుంచి ఫాస్ట్బౌలర్లు రారు' అని రావల్పిండి ఎక్స్ప్రెస్ మండిపడ్డాడు. అక్తర్ పాక్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20 ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్లు ఆడిన అక్తర్.. 444 వికెట్లతో ప్రపంచంలో అత్యంత భయంకరమైన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. 2003 వన్డే ప్రపంచకప్లో గంటకి 161.3కిమీ వేగంతో బంతిని విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
కోహ్లీ పుల్ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడతాడు:
నా బౌలింగ్ వేగానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పుల్ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడతాడని అక్తర్ చెప్పుకొచ్చాడు. 'కోహ్లీ, నేను బెస్ట్ ఫ్రెండ్స్. కానీ మైదానంలో మాత్రం బద్ద శత్రువులం. మేం ఇద్దరం పంజాబీలం కావడంతో మా ఇద్దరి స్వభావం ఒకేలా ఉంటుంది. అతడు నాకన్నా చాలా జూనియర్. కానీ కోహ్లీని నేను గౌరవిస్తా. కోహ్లీ ఈ తరం బ్రాడ్మన్' అంటూ అక్తర్ వ్యాఖ్యానించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో వీరిద్దరూ ఎప్పుడూ తలపడలేదు. అయితే ఆసియా కప్-2010లో భాగంగా భారత్-పాక్ల మధ్య మ్యాచ్ జరగ్గా.. ఆ మ్యాచ్లో వీరిద్దరూ ఆడారు. కానీ అక్తర్ బౌలింగ్ను ఆడే అవకాశం కోహ్లీకి దక్కలేదు.