హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్కు రెండు కీలక పదవులు కట్టబెడుతున్నట్లు బోర్డు శనివారం ప్రకటించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బ్రాండ్ అంబాసిడర్తో పాటు చైర్మన్ అడ్వైజర్గా షోయబ్ను నియమించినట్టు అధ్యక్షుడు నజీం సేథీ ప్రకటించారు.
'క్రికెట్ సంబంధాల విషయంలో పీసీబీ అధ్యక్షుడికి సలహాదారుగానూ, అదే సమయంలో పీసీబీకి బ్రాండ్ అంబాసిడర్గానూ అక్తర్ నియమితులయ్యారు' అని చైర్మన్ నజీం సేథీ తెలిపారు. తనకు లభించిన కొత్త పదవులపై అక్తర్ హర్షం వ్యక్తం చేశాడు. ఇది తనకు దక్కిన గౌరవంగా పేర్కొన్నాడు.
తన 14 ఏళ్ల కెరీర్లో దేశానికి ఏవిధంగా సేవలు చేశానో, అదే స్ఫూర్తిని ఇప్పుడూ కొనసాగిస్తానని అక్తర్ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. తాను క్రికెటర్గా ఉన్నప్పుడు ఎవరితోనైతే గొడవలు పడ్డాడో ఇప్పుడు ఆయనే షోయబ్ అక్తర్ను ఈ కీలక పదవుల్లో నియమిస్తూ ప్రకటించాడు.
Am honored to be chosen for these positions in @TheRealPCB ,will work with same passion as i did when playing.Thank you once again!#ShoaibAkhtar #PCB #BrandAmbassador #Advisor
— Shoaib Akhtar (@shoaib100mph) February 16, 2018
తన కెరీర్ ఆసాంతం క్రికెట్ బోర్డుతో ఘర్షణపడుతూ వచ్చిన అక్తర్.. ప్రస్తుతం బోర్డు చైర్మన్గా ఉన్న నజీం సేథీతో అనేకమార్లు విభేదించాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సేథీ చైర్మన్గా ఉంటే పాక్ క్రికెట్కు కష్టాలు తప్పవని, పాక్ క్రికెట్ను సర్వ నాశనం చేస్తున్నాడని ఆరోపించాడు.
అలాంటి వారిద్దరూ ఇప్పుడు ఆత్మీయులుగా మారిపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఫామ్ కోల్పోవడంతో 2005లో ఆస్ట్రేలియా సిరీస్కు అక్తర్ను పక్కనపెట్టారు. ఆ తర్వాత 2006లో నిషేధిత ఉత్ర్పేరకాలు వాడి అక్తర్ దొరికిపోయిన సంగతి తెలిసిందే. పాక్ తరపున 46 టెస్టులు, 163 వన్డేలు 15 టీ20లు ఆడిన షోయబ్ 444 అంతర్జాతీయ వికెట్లు తీసుకున్నాడు.