స్పదించిన పలువురు మాజీలు:
కరోనా నేపథ్యంలో ఇకపై బౌలర్లు బంతిపై ఉమ్మిని రుద్దాలంటే.. ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. 2018 బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత బంతి స్థితిపై పర్యవేక్షణ పెరిగింది కానీ.. ఉమ్ము, చెమట రాయడాన్ని ఐసీసీ నేరంగా పరిగణించట్లేదు. అయితే బంతి షైనింగ్ కోసం ఉమ్మికి దూరంగా ఉంటే బౌలర్లు పట్టు కోల్పోతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్ ఎప్పుడు ఆరంభమయ్యేది ప్రశ్నార్థకమే అయినా.. ఒకవేళ పరిస్థితులు సద్దుమణిగితే బౌలర్లు ఏం చేయాలనే విషయమై పలువురు మాజీలు స్పందించారు.
ఉమ్మి రాయడాన్ని అనుమతించకూడదు:
కరోనా నేపథ్యంలో బంతికి ఉమ్మి రాయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని అంటున్నారు వెంకటేశ్ ప్రసాద్, జాసన్ గిలెస్పీ, ప్రవీణ్ కుమార్ లాంటి మాజీ బౌలర్లు. 'కరోనా ప్రభావం తగ్గి మళ్లీ క్రికెట్ ఆరంభం అయ్యాక బౌలర్లు అవసరమైన పక్షంలో బంతి మెరుపు కోసం చెమటను ఉపయోగించుకోవచ్చు. కానీ ఉమ్మిని కాదు. ప్రతి ఒక్కరికి ఇలా ఎక్కువగా స్వేదం రాకపోవచ్చు. ఇలాంటప్పుడు చెమట వచ్చే వాళ్ల వైపు బంతిని విసిరి తద్వారా బంతిని మెరిసేలా చేయచ్చు. ఎందుకంటే ఆటగాళ్ల భద్రతే ప్రధానం' అని ప్రసాద్ అన్నాడు.
బంతి మెరుపు కోసం ఇతర అవకాశాలను అన్వేషించాలి:
'క్రికెట్ మొదలయ్యాక కనీసం కొన్ని నెలలైనా ఇలా ఉమ్మి ఉపయోగించడాన్ని నిషేధించాలి. బంతి మెరుపు కోసం ఇతర అవకాశాలను అన్వేషించాలి' అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నాడు. 'బంతిపై లాలాజలాన్ని రుద్దడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన సమయమొచ్చింది. ప్రతి ఓవర్ పూర్తి అయిన తర్వాత తమ సమక్షంలోనే ఆటగాళ్లు బంతి మెరుపు కోసం ప్రయత్నించేలా అంపైర్లు చూసుకోవాలి' అని గిలెస్పీ చెప్పాడు.
వైద్యులు చెబితే మానేస్తాం:
క్రికెట్ బంతికి ఉమ్మిని పూయాలా? వద్దా? అనే విషయంలో చర్చ జరగాల్సి ఉందని ఆసీస్ పేసర్ జోష్ హాజెల్వుడ్ అన్నాడు. 'బంతి మెరుపు కోసం ఉమ్మును రాయడం అనే ప్రక్రియపై చర్చించాల్సిన సమయమిది. నా దృష్టిలో ఇది తెల్ల బంతుల వరకు ఫర్వాలేదు. కానీ టెస్టు క్రికెట్లోనే ఇబ్బంది. ఎక్కువ ఓవర్ల పాటు బంతి మెరుపును కాపాడాలన్నా.. స్వింగ్ను రాబట్టాలన్నా ఉమ్మి, చెమట ఉపయోగించేవాళ్లం. ఉమ్మి, స్వేదం ఉపయోగించకూడదని మా వైద్యులు చెబితే మానేస్తాం' అని హాజెల్వుడ్ చెప్పుకొచ్చాడు.