ఒత్తిడిని ఎలా జయించాలో తెలుసు:
'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు తీసుకున్న తర్వాత శిఖర్ ధావన్ మాట్లాడుతూ... 'అంతర్జాతీయ క్రికెట్లో ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. ఒక అనుభవజ్ఞుడైన ఆటగాడిగా ఒత్తిడిని ఎలా జయించాలో నాకు తెలుసు. సీనియర్ ఆటగాడిగా ఎలాంటి పిచ్పై ఎలాంటి షాట్లు ఆడాలో నాకు తెలుసు. వికెట్లను అధ్యయనం చేసి బ్యాటింగ్ విభాగానికి చక్కగా వివరిస్తా. తొలి వన్డేలో టీమిండియాకు ఇదే పనిచేసింది. ఒక్కసారి నేను క్రీజులో నిలిచానంటే.. చక్కని షాట్లు ఆడగలను. దాంతో పరుగులు అవే వస్తాయి' అని తెలిపాడు.
టీ20 సిరీస్ ఆడనప్పుడు:
'టీ20 సిరీస్ ఆడనప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను. నా బ్యాటింగ్, ఫిట్నెస్, నైపుణ్యాలు, కసరత్తులపై దృష్టి సారించాను. మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. ఎదురయ్యే ప్రతి సందర్భం నుంచి సానుకూలతనే తీసుకుంటాను. నేనెప్పుడూ ఇలాగే ఉంటాను. ఖాళీ సమయంలో బ్యాటింగ్పై దృష్టి పెట్టాను. అవకాశం వస్తే పరుగులు చేస్తానని నాకు తెలుసు. పూణే పిచ్పై ఆరంభంలో దూకుడుగా ఆడితే వికెట్లు పోతాయి. అందుకే మంచి బంతుల్ని గౌరవించాలని నేను, రోహిత్ నిర్ణయించుకున్నాం. క్రీజులో నిలదొక్కుకుంటే మ్యాచ్ సాగే కొద్దీ పరుగుల వరద పారించొచ్చు' అని గబ్బర్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ అనుభవం ఉపయోగపడుతోంది:
'కొత్తగా జట్టులోకి వచ్చిన కుర్రాళ్లకు దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ అనుభవం ఉపయోగపడుతోంది. ఐపీఎల్లో గొప్ప గొప్ప ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం కుర్రాళ్లకు మేలు చేస్తోంది. కృనాల్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ ఆత్మవిశ్వాసంగా ఉండటానికి ఇదే కారణం. కేఎల్ రాహుల్ క్లాస్ ఆటగాడు. సొగసైన సిక్సర్లతో అలరించాడు. కృనాల్తో కలిసి అతడు మెరుపులు మెరిపించడంతోనే భారత్ 317 పరుగులు చేసింది' అని ధావన్ చెప్పుకొచ్చాడు.
రిజర్వు బెంచ్కే పరిమితం:
టీ20ల్లో నాలుగు మ్యాచుల్లో రిజర్వు బెంచ్కే పరిమితమైన శిఖర్ ధావన్పై తొలి వన్డేలో తీవ్ర ఒత్తిడి నెలకొంది. అదీకాకుండా ఇంగ్లండ్ పేసర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్తులో బంతులు విసిరి స్వింగ్ చేశారు. ఈ క్రమంలో నిలకడగా ఆడిన గబ్బర్ 98 పరుగులు సాధించాడు. రోహిత్, కోహ్లీ, ఇయ్యర్ పెవిలియన్ చేరినా.. క్రీజులో నిలబడి పరుగులు చేశాడు. అయితే 98 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెన్ స్టోక్స్ వేసిన షార్ట్ పిచ్ స్లో బంతిని పుల్ షాట్ ఆడబోయి.. షార్ట్ మిడ్ వికెట్లో ఇయాన్ మోర్గాన్కు క్యాచ్గా చిక్కాడు.
అరుదైన ఘనత:
తొలి వన్డేలో టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన ఐదవ భారత లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మన్గా ధావన్ రికార్డుల్లోకి ఎక్కాడు. తొలి వన్డే ద్వారా ఆసియాలో గబ్బర్ 5000 వేల పరుగులు పూర్తిచేశాడు. ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ (10589), యువరాజ్ సింగ్ (7954), గౌతమ్ గంభీర్ (7327), సురేష్ రైనా (5027) గబ్బర్ కంటే ముందున్నారు.