ఓపెనింగ్ కొత్త కాదు:
రోహిత్ శర్మ-డేవిడ్ వార్నర్ వ్యాఖ్యలు శిఖర్ ధావన్లో కాస్త అసహనాన్ని కల్గించినట్లే కనబడుతున్నాయి. తాజాగా భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్తో ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో పాల్గొన్న ధావన్.. వార్నర్ వ్యాఖ్యలపై స్పందించాడు. 'నాకు ఓపెనింగ్ కొత్త కాదు. ఎనిమిదేళ్లుగా ఓపెనింగ్ చేస్తున్నా. నేను ఏదో తొలి బంతిని ఆడటాన్ని, మొదటి ఓవర్ను ఆడటాన్ని ఇష్టపడనని అన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి' అని గబ్బర్ అన్నాడు. ధావన్ భారత్ తరఫున 34 టెస్టులు, 136 వన్డేలు, 61 టీ20లు ఆడాడు.
ఓపెనింగ్కు దిగడం ఎందుకు:
'ఒకవేళ తొలి ఓవర్ను ఆడకపోతే.. రెండో ఓవర్నైనా బంతిని ఆడాలి కదా. మూడు ఫార్మాట్లలో ఓపెనర్గా కొనసాగుతున్నా. ఒకవేళ మనకు సీమింగ్ వికెట్ ఎదురైతే.. కాస్త కఠినంగా ఉంటుంది. కానీ ఆడక తప్పదు. పేస్ బౌలర్లను ఆడకపోతే ఇక ఓపెనింగ్కు దిగడం ఎందుకు. నేను ఓపెనర్ అయినప్పుడు నాకు తొలి ఓవర్ను ఎందుకు ఆడలేను' అని ధావన్ చెప్పుకొచ్చాడు. 'మనం సెంచరీ చేసినప్పుడు కొనియాడే వ్యాఖ్యతలే, డకౌట్ అయితే విమర్శిస్తారు. అది వారి జాబ్. మనం కూడా కామెంటరీ బాక్స్లో ఉంటే అదే చేస్తాం. ఎవరి జాబ్ వారిది' అని అన్నాడు.
ధావన్ ఒక ఇడియట్:
అంతకుముందు రోహిత్ మాట్లాడుతూ... 'ధావన్ ఒక ఇడియట్. తొలి బంతిని ఫేస్ చేయడానికి ఇష్టపడేవాడు కాదు. 2013లో పరిమిత ఓవర్ల క్రికెట్లో నేను ఓపెనర్గా అరంగేట్రం చేశా. అది చాంపియన్స్ ట్రోఫీ. ఓపెనర్గా నా తొలి మ్యాచ్. ఆ సమయంలో ధావన్ను స్ట్రైక్ తీసుకోమన్నా. దానికి ధావన్ ఒప్పుకోలేదు. రోహిత్.. నువ్వు చాలా కాలం నుంచి ఆడుతున్నావ్. ఇది నా తొలి పర్యటన. నువ్వే ఇన్నింగ్స్ను ఆరంభించాలన్నాడు. దీంతో నేనే స్టైక్ తీసుకున్నా' అని రోహిత్ తెలిపాడు.
బాగా జడ్జ్ చేశావ్:
రోహిత్ మాటల అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్కు ధావన్ ఓపెనింగ్ చేసిన విషయాల్ని వార్నర్ షేర్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరు చెబుతారా అని నిరీక్షిస్తున్నట్లు అభిప్రాయపడ్డాడు. ధావన్ గురించి బాగా జడ్జ్ చేశావంటూ వార్నర్ పేర్కొన్నాడు. దీంతోనే ధావన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. గాయంతో గత కొంతకాలంగా గబ్బర్ టీమిండియా జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా ఓపెనర్లుగా బరిలోకి దిగుతుండగా.. పరిమిత ఓవర్ల క్రికెట్జట్టులో రోహిత్కు జోడీగా కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు.
రీ ఎంట్రీ ఇవ్వడం అలవాటుగా మారిపోయింది:
ఇర్ఫాన్ పఠాన్తో మాట్లాడుతూ.. త్వరోలోనే తాను జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తానని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ఇద్దరూ మాట్లాడుతండగా.. ధావన్ ఇంటర్నెట్ కనెక్షన్ పలుమార్లు అంతరాయానికి గురైంది. ఈ నేపథ్యంలో తనకు రీ ఎంట్రీ ఇవ్వడం అలవాటుగా మారిపోయిందని చమత్కరించాడు. నిజానికి గతేడాది గబ్బర్ ఎక్కువ మ్యాచులు ఆడలేదు. చివరకు దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయినా.. కరోనా వైరస్ కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయింది.