
హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సూపర్ ఫామ్తో చెలరేగిపోతున్నాడు. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో పరుగుల వరద పారించిన ధావన్.. తన జోరును ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లోనూ కొనసాగించాడు. జట్టులో మిగతా బ్యాట్స్మన్ విఫలమైనప్పటికీ ఒంటి చేత్తో భారీ స్కోరు అందించాడు. పర్యటనకు ముందు అనారోగ్యంతో ఇబ్బందికి గురైనా తిరిగి తన ఫామ్ సంపాదించుకున్నాడు.
49 బంతుల్లో 6 ఫోర్లు, 6సిక్సర్లు బాదిన ధావన్ (90) పరుగులు చేయగలిగాడు. భారత్ 5 వికెట్లకు 174 పరుగులు చేయడంలో ధావన్ ప్రధాన పాత్ర పోషించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో తన వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు 80ను తాజాగా అధిగమించాడు. మరోవైపు గబ్బర్ మరో ఘనత కూడా అందుకున్నాడు.
టీ20 క్రికెట్లో ఇప్పటి వరకు శ్రీలంకపై బ్యాట్స్మెన్ల జాబితాలో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా కెప్టెన్ విరాట్ కోహ్లీ(82) పేరిట ఉంది. తాజాగా లంకపై భారత్ తరఫున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా ధావన్(90) నిలిచాడు. లంకపై విరాట్ తరువాత మరే ఆటగాడు మంచి ఇన్నింగ్స్లు ఆడిన దాఖలాలు లేవు. లంకతో కొన్ని టీ20 మ్యాచ్ల్లో అతడు 82, 78, 68 పరుగులతో రాణించి మంచి రికార్డు కొనసాగిస్తున్నాడు.
అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి భారత స్కోరును 174పరుగులు చేయించినా.. ఐదు వికెట్ల నష్టంతో భారత జట్టు ఓడిపోయింది. తొలి మ్యాచ్ కావడంతో ఇరు జట్లు భారీ అంచనాలకు దిగినా లంక జట్టు శుభారంభాన్ని నమోదు చేసుకుంది. ఇదే నిదహాస్ ట్రోఫీలో భారత్ జట్టు రెండో టీ20 మ్యాచ్ను గురువారం బంగ్లాదేశ్తో తలపడనుంది.