హైదరాబాద్: తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో ధావన్ ర్యాంకు మరింత మెరుగైంది. బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్ కెరీర్ అత్యుత్తమ ర్యాంకులను సొంతం చేసుకున్నారు. ఇటీవల ముగిసిన అఫ్గనిస్థాన్ ఏకైక టెస్టు మ్యాచ్లో ఓపెనర్లిద్దరూ చెలరేగి సెంచరీలతో మోత మోగించారు.
ముఖ్యంగా శిఖర్ ధావన్ ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 618 పాయింట్లతో 24వ ర్యాంకు దక్కించుకున్నాడు. శిఖర్ ధావన్కు ఇదే కెరీర్ బెస్ట్ ర్యాంకు కావడం విశేషం. మురళీ విజయ్ ఆరు స్థానాలు మెరుగుపరుచుకొని 624 రేటింగ్ పాయింట్లతో జాబితాలో 23వ ర్యాంకులో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆఖరి టెస్టులో ఆడకపోవడంతో అతని స్థానం స్థిరంగానే ఉంది.
కోహ్లీ ఒక్కడే 903 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతనికంటే ముందుగా 929 పాయింట్లతో స్టీవ్ స్మిత్ మొదటి స్థానంలో ఉన్నాడు. బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో టాప్-10లో ఉన్న ఏకైక భారత బ్యాట్స్మన్ కోహ్లీనే.
మరోవైపు బౌలర్ల జాబితాలో రవీంద్ర జడేజా ఒక స్థానం మెరుగుపరచుకొని మూడో ర్యాంకు అందుకున్నాడు. బెంగళూరులో అఫ్గాన్తో టెస్టులో జడేజా 6 వికెట్లు పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ రెండు స్థానాలు ఎగబాకి 25వ ర్యాంకు, ఉమేశ్ యాదవ్ సైతం రెండు స్థానాలు మెరుగుపరచుకొని 26వ ర్యాంకులో నిలిచాడు. అఫ్గాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ టీ20ల్లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. వన్డేల్లో రెండోస్థానంలో ఉన్నాడు.