
ధావన్ జీతం ఒక్క ఏడాదిలోనే ఏకంగా 1400 శాతం పెరిగింది. ధావన్ గతంలో ఏడాదికి రూ.50 లక్షలు మాత్రమే అందుకునేవాడు. ఇప్పుడతని జీతం రూ.7 కోట్లకు చేరింది. అటు రోహిత్ శర్మకు 700 శాతం, కెప్టెన్ విరాట్ కోహ్లికి 350 శాతం మేర జీతాలు పెరిగాయి. దీంతో కోహ్లీ, రోహిత్ లు రూ. 7కోట్లు పారితోషికం అందుకోనున్నారు.
కొత్త కాంట్రాక్ట్ సిస్టమ్లో భాగంగా ఎ+ అనే కేటగిరీని చేర్చిన విషయం తెలిసిందే. ఇందులోని ప్లేయర్స్కు ఏడాదికి రూ.7 కోట్లు చెల్లించనున్నారు. ఈ ఎ+ కేటగిరీలో కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. మాజీ కెప్టెన్ ధోనీ ఎ కేటగిరీకి పరిమితమైనా.. అతని జీతం కూడా 150 శాతం పెరగడం విశేషం.
కేటగిరీల వారీగా జీతాలిలా ఉన్నాయి:
ఎ కేటగిరీ ప్లేయర్స్కు రూ.5 కోట్లు చెల్లిస్తారు. ఈ 'ఎ' గ్రేడ్లో ధోనీ కాకుండా మరో ఆరుగురు ప్లేయర్స్ ఉన్నారు. అశ్విన్, జడేజా, మురళీ విజయ్, పుజారా, రహానే, సాహా ఈ కేటగిరీలో స్థానం సంపాదించారు. సాహా జీతం కూడా ఏకంగా 500 శాతం పెరగడం విశేషం.
గ్రేడ్ 'బి'లో..
రాహుల్, ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చాహల్, హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, దినేష్ కార్తీక్లు ఉన్నారు. వీళ్లకు ఏడాదికి రూ.3 కోట్లు చెల్లిస్తారు.
'సి' గ్రేడ్లో..
కేదార్ జాదవ్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, సురేశ్ రైనా, పార్థివ్ పటేల్, జయంత్ యాదవ్ ఉన్నారు. వీళ్లకు ఏడాదికి రూ.కోటి ఇవ్వనున్నారు.
గతంలో బీసీసీఐ క్రికెటర్లకు అత్యధికంగా రూ.2 కోట్లే ఇచ్చేవాళ్లు. అదిప్పుడు మూడున్నర రెట్లు పెరిగి రూ.7 కోట్లకు చేరింది. ఈ జీతాల పెంపునకు కోహ్లీతో పాటుగా కృషి చేసిన ధోనీకి మాత్రం గ్రేడు తగ్గి 'బీ'కి పడిపోవడంతో అతని జీతం రూ. 5కోట్లుగా ఉంది. అయితే ఇందులో కొందరికి జాక్ పాట్ తగలగా.. మరికొందరికి ఉన్న కాంట్రాక్టులూ పోయాయి.