కివీస్తో కీలకమైన మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. క్రీస్ట్చర్చ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో కూడా శిఖర్ ధవన్ టాస్ ఓడాడు. ఈ వన్డే సిరీస్లో అతను ఒక్కసారి కూడా టాస్ గెలవకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన కివీస్ సారధి కేన్ విలియమ్సన్ మరోసారి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన కేన్ విలియమ్సన్.. పిచ్లో అనుకున్నంత దాని కన్నా ఎక్కువ బౌన్స్ కనపడుతోందని అన్నాడు. ఈ కారణంగానే బ్రేస్వెల్ స్థానంలో మళ్లీ ఆడమ్ మిల్నేను ఆడిస్తున్నట్లు తెలిపాడు. అదే సమయంలో భారత జట్టులో ఎలాంటి మార్పులూ లేవని, రెండో మ్యాచ్లో ఆడిన జట్టుతోనే బరిలో దిగుతున్నామని శిఖర్ ధవన్ చెప్పాడు. అంటే దీపక్ హుడాను తీసుకొని సంజూ శాంసన్కు మరోసారి మొండిచెయ్యి చూపించారన్నమాట.
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఏమాత్రం చెప్పుకోదగిన ప్రదర్శనలు చేయని రిషభ్ పంత్ను మాత్రం వైస్ కెప్టెన్ హోదాలో టీమిండియా కొనసాగిస్తూనే వస్తోంది. అలాగే టీ20 వరల్డ్ కప్ నుంచి వరుసగా ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్కు విశ్రాంతి ఇస్తారని అనుకున్న అభిమానులకు కూడా నిరాశే మిగిలింది. రెండో మ్యాచ్లో ఆడే అవకాశం దక్కని దీపక్ హుడాకు ఈ మ్యాచ్లో ఆడే అవకాశం లభించవచ్చు.
రెండో మ్యాచ్కు జరిగినట్లే ఈ మ్యాచ్కు కూడా టాస్ ఆలస్యమైంది. వర్షం పడటంతో మైదానాన్ని కవర్స్తో కప్పేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంత వర్షం తగ్గిన తర్వాత టాస్ వేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ మనసులో చాలా ఆందోళన తలెత్తుతోంది. రెండో మ్యాచ్లా ఇది కూడా వర్షం వల్ల రద్దయితే భారత్కు గట్టి దెబ్బ పడినట్లే. ఎందుకంటే తొలి వన్డేలో భారత్ ఓడిపోవడంతో ఈ సిరీస్లో టీమిండియా 0-1త వెనుకబడి ఉంది.
టీమిండియా: శిఖర్ ధవన్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్
న్యూజిల్యాండ్ జట్టు: డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ లాథమ్, డారియల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సౌథీ, మిచెల్ శాంట్నర్, ఆడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్.