హైదరాబాద్: ఆసియా కప్ శుక్రవారంతో ముగియనుంది. ఆ తర్వాత వెస్టిండిస్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ టెస్టు సిరీస్ కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్టర్లు భారత జట్టుని బుధవారమే ప్రకటించాల్సి ఉంది. అయితే, సెలెక్టర్లు అందుబాటులో లేని కారణంగా సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, దేవాంగ్ గాంధీ కలిసి ప్రాథమికంగా ఓ జాబితాను సిద్ధం చేశారు.
ఎన్సీఏలో 29న ఇషాంత్, అశ్విన్కు ఫిట్నెస్ పరీక్ష
ఈ జాబితాలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్కి చోటు దక్కడం అనుమానంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్లో ధావన్ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో.. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ కోసం అతని స్థానంలో యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ని తీసుకోవాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటకకు చెందిన ఈ యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ గత ఏడాది కాలంగా దేళవాళీ క్రికెట్లో రాణిస్తున్నాడు. 2017-18 విజయ్ హజారే ట్రోఫీలో ఎనిమిది మ్యాచ్లాడిన మయాంక్ అద్బుతమైన రీతలో 723 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టులో ఆడేందుకు గాను సెలక్టర్ల నుంచి అతడికి పిలుపు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
మయాంక్ అగర్వాల్కి జోడీగా మరో ఓపెనర్గా కేఎల్ రాహుల్ ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ గడ్డపై ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టులో సెంచరీ బాదిన ఈ ఓపెనర్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మూడో ఓపెనర్ లేదా మిడిలార్డర్ కోసం రోహిత్ శర్మ పేరుని కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నారు.
భారత్ Vs ఆప్ఘన్ మ్యాచ్: ఈ ఫోటో కోట్ల మంది హృదయాలను గెలుచుకుంది
వెస్టిండిస్ జట్టు భారత పర్యటనలో భాగంగా రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. అక్టోబర్ 4 నుంచి ఈ టెస్టు సిరిస్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్న భారత్ జట్టు శుక్రవారం బంగ్లాదేశ్తో ఫైనల్ ఆడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ తర్వాత విండిస్ తో తలపడే జట్టుని సెలక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది.