ప్రపంచకప్ ఆడటం కల..
రాంచీ వేదికగా ఆదివారం జరగనున్న రెండో వన్డే నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్ శనివారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చాడు. టీ20 ప్రపంచకప్ ఆడటం, గెలవడం ప్రతీ ఒక్క ఆటగాడి కలని, ఆ అవకాశం చేజార్చుకున్నందుకు చాలా బాధగా ఉందన్నాడు.
'చాలా రోజులుగా నా బ్యాటింగ్పై ప్రత్యేక దృష్టి సారించాను. ఎందుకంటే 7, 8, 9 స్థానాల్లో వచ్చే వారు చేసే పరుగులు మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తాయి. ఈ లోయరార్డర్ బ్యాటర్లు చేసే పరుగులతో జట్టుకు భారీ స్కోర్ లభించడంతో పాటు చేజింగ్లో విజయవకాశాలుంటాయి.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్టులో..
సక్సెస్ఫుల్ టీమ్స్ బ్యాటింగ్ ఆర్డర్ చాలా డీప్గా ఉంటుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాలను చూస్తే ఈ విషయం మీకు అర్థమవుతోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్లు 8, 9 స్థానాల్లో బరిలోకి దిగి పరుగులు చేస్తారు. వారు చేసే 15-20 పరుగులు జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతాయి. మరీ భారత్ మాత్రం ఆ దిశగా ఎందుకో ఆలోచించడం లేదు.'అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు. పరోక్షంగా మెగా టోర్నీకి తనను విస్మరించడాన్ని తప్పుబట్టాడు.
విమర్శించడం సరికాదు..
భారత బౌలింగ్ గతి తప్పిందంటూ వస్తున్న విమర్శలను సరైనవి కావని శార్దూల్ ఠాకూర్ అన్నాడు. విమర్శలు చేసే ముందు ఎలాంటి పరిస్థితుల్లో ఆడుతున్నారనే విషయాన్ని గ్రహించాలని సూచించాడు.'భారత బౌలర్లపై వస్తున్న విమర్శలు సరైనవి కావు. బౌలర్ల నిలకడలేమిపై విమర్శలు చేసే ముందు ఎలాంటి వికెట్, కండిషన్స్పై ఆడారనే విషయాన్ని గ్రహించాలి. కొన్నిసార్లు వన్డేల్లో కూడా 350 పైగా స్కోర్లు నమోదవుతాయి. అప్పుడు ప్రతీ ఒక్క బౌలర్ ధారళంగా పరుగులిచ్చుకుంటాడు.'అని బౌలర్ల వైఫల్యంపై అడిగిన ప్రశ్నకు శార్దూల్ బదులిచ్చాడు.
ధోనీని మిస్సవుతున్నాం..
రాంచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ధోనీ లేకపోవడాన్ని ఎంతో మిస్సవుతున్నామని శార్దూల్ తెలిపాడు. 'జట్టులోని ప్రతీ ఒక్కరం ధోనీని మిస్సవుతున్నాం. 300 కంటే ఎక్కువ వన్డేలు, దాదాపు 90 టెస్ట్లు, ఎన్నో టీ20 మ్యాచ్లు ఆడాడు. అతనిలాంటి అనుభవజ్ఞుడు ఉండటం చాలా అరుదు.'అని శార్దూల్ చెప్పుకొచ్చాడు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్ను 9 పరుగులతో ఓడిపోయిన భారత్.. రెండో వన్డేలో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.