ఢిల్లీ: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఓడిపోవడంతో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తన బాధ్యతలను సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని మాజీ సారథి శాంతా రంగస్వామి అభిప్రాయపడ్డారు. మెగా టోర్నీలో యువ సంచలనం షెఫాలీ వర్మ మాత్రమే విశేషంగా రాణించిందని, మిగతా క్రికెటర్లు ప్రపంచకప్ సాధించేంత కృషి చేయలేకపోయారన్నారు. భారత్ ఫైనల్కు చేరడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తదితరులు ప్రశంసలు కురిపిస్తుంటే..శాంతా రంగస్వామి విమర్శలు చేయడం విశేషం.
ఆ పని ఇక్కడ చేస్తే.. భార్యకు బానిస అనేవాళ్లు: సానియా
శాంతా రంగస్వామి మాట్లాడుతూ... 'ఎంతో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత జట్టు పేలవంగా టోర్నీ ముగించడం బాధించింది. స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ లాంటి మేటి బ్యాట్స్వుమెన్ రాణించకపోవడంతో నిరాశ చెందా. ఈ టోర్నీలో షెఫాలీ మాత్రమే విశేషంగా రాణించింది. మిగతా క్రికెటర్లు ప్రపంచకప్ సాధించేంత కృషి చేయలేకపోయారు. కెప్టెన్సీని ఎప్పుడు వదులు కోవాలో హర్మన్కు బాగా తెలుసు. తన కెప్టెన్సీని ఇప్పుడు సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తను ఎంతో పరిణతి చెందిన వ్యక్తి. కెప్టెన్గా కంటే బ్యాట్స్వుమన్గానే జట్టుకెంతో అవసరం. ముఖ్యంగా టీ20ల్లో' అని అన్నారు.
'మంధాన, రోడ్రిగ్స్, హర్మన్లు విశేషమైన టాలెంట్ ఉన్న క్రీడాకారిణులు. వారు ఈ టోర్నీ మొత్తం విఫలమయ్యారు. ప్రధానంగా హర్మన్ ఫెయిల్యూర్ కావడమైతే మ్యాచ్పై ప్రభావం చూపిందనుకుంటున్నా. ఎన్నో ఆశలు పెట్టుకున్న వేదా కృష్ణమూర్తి కూడా రాణించలేదు' అని పేర్కొన్నారు. మెగా టోర్నీ అంతా కలిపి హర్మన్ కేవలం 30 పరుగులు మాత్రమే చేశారు. లీగ్ దశలో 28 పరుగులు చేసిన హర్మన్.. తుది పోరులో 2 పరుగులకే పెవిలియన్ చేరింది.
మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జి స్పందిస్తూ ఫైనల్లో ఓటమికి టీమిండియా ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. 'ఇప్పుడు హర్మన్ప్రీత్ జట్టుపై కోపంగా ఉండాల్సిన అవసరం లేదు. జట్టు బలాబలాలు సమీక్షించుకోవాలి. ఓటమిని పక్కన పెడితే ఈ టోర్నీలో అనేక సానుకూలాంశాలు వెలుగులోకి వచ్చాయి. షెఫాలీ బ్యాటింగ్, శిఖా బౌలింగ్తో పాటు స్పిన్నర్ల సామర్థ్యం తెలిసొచ్చింది. అలాగే ఆస్ట్రేలియా ఓపెనర్ అలిస్సా హీలి మ్యాచ్ను దూరం చేసింది' అని ఎడుల్జి పేర్కొన్నారు.