చెన్నై: కెప్టెన్సీ అంటే టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీదేనని, అతని లాంటి సారథి లేడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ కొనియాడాడు. కరోనా విజృంభిస్తుండడంతో ఈ సీజన్ ఐపీఎల్ నిర్వహణపై సందేహం నెలకొంది. ఈ తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లందరితో ఇన్స్టాగ్రాంలో ఓ లైవ్ సెషన్ను నిర్వహించింది.
ఈ లైవ్చిట్ చాట్లో పాల్గొన్న వాట్సన్ తన మనసులోని మాటలను చెప్పుకొచ్చాడు. గత సీజన్ ఐపీఎల్లో తనపై అపార నమ్మకం ఉంచి, వెన్నుతట్టిన కెప్టెన్ ధోనీ, కోచ్ ఫ్లెమింగ్లకు హృద్యపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు. అసలు ధోనీ లాంటి సారథే లేడని, నిజమైన నాయకత్వం అతనిదేనని ప్రశంసల జల్లు కురిపించాడు.
చెన్నైకి ఆడుతున్నప్పుడు వరుసగా పది మ్యాచుల్లో మంచి ప్రదర్శన చేయకపోయినా తుది జట్టులో స్థానం ఉంటుంది. అదే మరో ఫ్రాంచైజీ అయితే మనపని అయిపోయినట్లే. రిజర్వ్ బెంచ్కు పరిమితం కావలసిందే. ఆటగాళ్లకు బ్రేక్ సమయంలో డ్రింక్స్ అందించుకుంటూ ఉండాలి. కానీ చెన్నై జట్టు అలా కాదు. అందుకు ముఖ్యంగా కెప్టెన్ ధోనీ, కోచ్ ఫ్లెమింగ్లకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
సీజన్ మొత్తంలో నేను బాగానే బ్యాటింగ్ చేశా. కానీ మంచి స్కోర్లు మాత్రం చేయలేకపోయా.. నన్ను బెంచ్కే పరిమితం చేస్తారనుకున్నా.. కానీ వాళ్లు అలా చేయలేదు. అయితే ఫైనల్ మ్యాచ్లో వారి నమ్మకాన్ని నేను నిలబెట్టగలిగాను. నేను కచ్చితంగా చెప్పగలను నిజమైన నాయకత్వం అంటే ధోనీదే'అని వాట్సన్ తెలిపాడు.
ఐపీఎల్ గత సీజన్ ఫైనల్ మ్యాచ్లో వాట్సన్ అద్భుతంగా పోరాడాడు. గాయపడ్డా.. మోకాలు నుంచి రక్తం కారుతున్నా.. ఆఖరి బంతి వరకు విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు. అతని పోరాట పటిమను మెచ్చుకొని వారుండరు. క్రీజులో పాతుకుపోయి చివరివరకూ పోరాడిన తీరు అమోఘం. మ్యాచ్ ఓడిపోయి ఉండవచ్చు.. కానీ ఆ మ్యాచ్ తరువాత వాట్సన్ను యావత్ క్రికెట్ ప్రపంచం కొనియాడింది. టైటిల్ ముంబై గెలుచుకున్నా.. అభిమానుల హృదయాలను మాత్రం వాట్సన్ గెలుచుకున్నాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.