బ్రిస్బేన్: టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా తొలి రోజులో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి కామెరాన్ గ్రీన్ (28; 70 బంతుల్లో 3x4), టిమ్ పైన్ (38; 62 బంతుల్లో 5x4) క్రీజులో ఉన్నారు. మార్నస్ లబుషేన్ (108; 204 బంతుల్లో 9x4) సెంచరీ చేయగా.. మాథ్యూ వేడ్ (45; 87 బంతుల్లో 6x4) ఫర్వాలేదనిపించాడు. ఇద్దరూ నాలుగో వికెట్కు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో.. తొలి రోజు ఆటలో ఆసీస్దే పైచేయిగా నిలిచింది. భారత బౌలర్లలో టీ నటరాజన్ 2 వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకుర్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు.:
నాలుగో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తరచూ నోటికి పని చెప్పడంతో ఆస్ట్రేలియా దిగ్గజాలు షేన్ వార్న్, మార్క్ వా అసహనం వ్యక్తం చేశారు. బ్యాట్స్మెన్ ఆడేటప్పుడు పంత్ మాట్లాడటం మానేయాలని సూచించారు. తొలి రోజు లబుషేన్, మాథ్యూ వేడ్ బ్యాటింగ్ చేస్తుండగా.. టీమిండియా కీపర్ ఏదో ఒకటి మాట్లాడుతూనే కనిపించాడు. అదే సమయంలో వార్న్, వా.. లైవ్ కామెంట్రీలోనే పంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వికెట్ కీపర్గా రిషభ్ పంత్ ఏం మాట్లాడినా అభ్యంతరం లేదని, అయితే బౌలర్ బంతులేసేటప్పుడు మాత్రం మాట్లాడకుండా ఉండాలని మార్క్ వా పేర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అంపైర్లు కలగజేసుకోవాలని కూడా సూచించాడు. ఇదే విషయమై స్పందించిన షేన్ వార్న్.. వా మాటలను సమర్ధించాడు. 'మీ మాటలతో ఏకీభవిస్తాను. పంత్ తన పరిమితుల మేరకు ఏం చేసినా పర్లేదు. కానీ బౌలర్ బంతులేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రం మాట్లాడకుండా ఉండాలి. అతడు బ్యాట్స్మెన్ దృష్టిని మరల్చకూడదు' అని పేర్కొన్నాడు.
బోర్డర్-గవాస్కర్ సిరీస్లో తొలుత ఇరు జట్ల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొన్నా.. ఒక్కసారిగా ఆ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. సిడ్నీ టెస్టు (మూడో టెస్టు)లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్కు పాల్పడటం, రవిచంద్రన్ అశ్విన్ను కెప్టెన్ టిమ్ పైన్ దూషించడం లాంటి సంఘటనలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే తాజా టెస్టులో ఇలా జరగడం గమనార్హం.