హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ కోచ్ షేన్వార్న్ జట్టు నుంచి అత్యత్తుమ ప్రదర్శన వెలికితీస్తాడని టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'గేమ్ ప్లాన్ ఇన్ యువర్ సిటీ' కార్యక్రమంలో భాగంగా వందలాది విద్యార్థులతో సమావేశమైన సందర్భంగా కైఫ్ మాట్లాడాడు.
'షేన్వార్న్కు మాయా శక్తులు ఉన్నాయి. ఆటగాడిలో ఎలాంటి సత్తా ఉందో వెంటనే గుర్తిస్తాడు. బ్యాట్స్మెన్, బౌలర్లు, ఫీల్డర్లు, వికెట్ కీపర్ నుంచి అత్యత్తుమ ఆటతీరును వెలికితీస్తాడు' అని అన్నాడు. ఐపీఎల్ 2018 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాప్-4లో ఉంటుందని కైఫ్ చెప్పాడు.
ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఆడబోతోన్న యువ క్రికెటర్లు కమలేశ్ నాగర్ కోటి, అహ్మద్, సల్మాన్ ఖాన్ గురించి కూడా కైఫ్ స్పందించాడు. ఈ యువ క్రికెటర్లను సరైన దిశగా నడిపించే, మార్గనిర్దేశం చేసే వారు ఎంతైనా అవసరమని కైఫ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
Very happy to be the brand ambassador of Chhattisgarh T20 League. pic.twitter.com/E4pzn3ndQR
— Mohammad Kaif (@MohammadKaif) March 14, 2018
ఉత్తర్ప్రదేశ్ నుంచి తాను అండర్-19 క్రికెట్ ఆడే సమయంలో ఎంతో మంది సీనియర్ క్రికెటర్లు తనను ప్రోత్సహించే వారని తెలిపాడు. నిలకడగా రాణించకపోవడం వల్లే ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక ధర పలికిన ఆటగాడు మరో సీజన్లో పత్తా లేకుండా పోతున్నాడని కైఫ్ తెలిపాడు.
ఇందుకు ఉదాహరణే ఇంగ్లాండ్ ఆటగాడు తైమాల్ మిల్స్. గతేడాది తైమాల్ మిల్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంఛైజీ రూ. 12 కోట్లు కొనుగోలు చేయగా, ఈ ఏడాది జరిగిన వేలంలో అతడు అమ్ముడోపోని ఆటగాళ్ల జాబితాలో నిలిచాడు. తొలి ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుని షేన్ వార్న్ విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే.