భారత్పై అక్కసు వెళ్లగక్కుతున్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ను పట్టించుకోవద్దని టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సూచించాడు. అమీర్ ఓ పనికిమాలినోడని, వార్తల్లో నిలవడం కోసం భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పాడు. అతని వ్యాఖ్యలకు బదులిచ్చి దిగజారాల్సిన అవసరం లేదని తెలిపాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభమైనప్పటి నుంచి అమీర్ భారత్కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అభిషేక్ శర్మ ఓ స్లాగర్ అని, భారత్ సెమీఫైనల్ కూడా చేరదన్న అమీర్.. ఇంగ్లండ్తో జరగబోయే సెమీఫైనల్లోనూ భారత్ ఓటమిపాలవుతుందని జోస్యం చెప్పాడు. అమీర్ వ్యాఖ్యలపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా కైఫ్ ఘాటుగా స్పందించాడు. అమెరికా వంటి పసికూన జట్టుపై సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయిన అమీర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు.

'టీమిండియా సెమీఫైనల్స్ చేరుకుంటుందని మహమ్మద్ అమీర్కు నిజంగా తెలియదా? డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ సునాయసంగా సెమీఫైనల్ చేరుతుందని అతనికి తెలుసు. కానీ అతను వార్తల్లో నిలవడం కోసం భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. మనం వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా అతని స్థాయికి దిగజారి బదులివ్వాల్సిన అవసరం కూడా లేదు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో అమెరికా చేతిలో పాక్ ఓటమికి ఈ మగాడే కారణం. ఆ మ్యాచ్లో సూపర్ ఓవర్ వేసిన అమీర్.. ఒక్క బౌండరీనే ఇచ్చినా.. చాలా వైడ్ బాల్స్ వేశాడు. అమెరికా వంటి పసికూన జట్టుకు భయపడుతూ.. కనీసం స్టంప్లైన్లో కూడా బంతిని సంధించలేకపోయాడు. అతని వల్లే పాకిస్థాన్ ఓటమిపాలైంది. నేను ఇంతకు మించి అతని గురించి ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు.'అని అమీర్కు కైఫ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
పాకిస్థాన్ జట్టు టీమిండియా కంటే ఎంతో వెనుకబడి ఉందని కైఫ్ అన్నాడు. 'అమీర్ను పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఆ దేశం క్రికెట్లో చాలా వెనుకబడి ఉంది. వారి జట్టులో సరైన ఆటగాళ్లు, సమర్థమైన కెప్టెన్, నైపుణ్యమున్న బౌలర్లూ లేరు. వారి మాట్లాడే ప్రతిదానికి మనం స్పందించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. వారు మన స్థాయికి చేరుకోవడం అసాధ్యం. మనం వారి మాటల మీద ఫోకస్ పెడితే.. వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుంది. వారు కోరుకునేది కూడా అదే.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.