
హైదరాబాద్: ముక్కోణపు టీ20 సిరిస్లో భాగంగా కొలంబో వేదికగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించిన బంగ్లా క్రికెటర్లకు ఐసీసీ జరిమానా విధించింది. పెవిలియన్లో ఆగ్రహం వ్కక్తం చేస్తూ అతిగా ప్రవర్తించిన బంగ్లా కెప్టెన్ షకిబ్ అల్ హసన్, ఇరు జట్ల మధ్య గొడవకు కారణమైన రిజర్వ్ ఆటగాడు నూరుల్ హసన్పై చర్యలు తీసుకుంది.
రెండు వేర్వేరు సంఘటనలలో ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించిన వీరిద్దరికి మ్యాచ్ ఫీజులో 25శాతం జరిమానా విధించడంతో పాటు ఇద్దరి ఆటగాళ్ల ఖాతాలో చెరో డీమెరిట్ పాయింట్ జత చేసింది. ఐసీసీ పవర్తనా నియమావళి ప్రకారం వీరిద్దరూ ఆర్టికల్ 2.1.1ని ఉల్లంఘించాలని మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఐసీసీకి నివేదిక పంపారు.
దీంతో లెవల్-1 ఉల్లంఘన కింద ఈ ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు చెరో డీమెరిట్ పాయింట్ను జత చేశారు. కొత్త జరిమానా వ్యవస్థ 2016 సెప్టెంబర్ 22న అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ఇద్దరు ఆటగాళ్లు ఖాతాలో చెరో డీమెరిట్ పాయింట్ చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ వివాదం బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో చోటు చేసుకుంది. ఆఖరి ఓవర్ శ్రీలంక బౌలర్ ఉదాన.. తొలి రెండు బంతుల్ని షార్ట్ పిచ్ బంతులుగా విసిరాడు. ఈ క్రమంలో రెండో బంతికి పరుగు కోసం ప్రయత్నించి ముస్తాఫిజుర్ రనౌటయ్యాడు. బంతి బ్యాట్స్మెన్ భుజం కన్నా ఎక్కువ ఎత్తులో వచ్చిందని.. నోబాల్ ఇవ్వాలంటూ బంగ్లాదేశ్ ఆటగాళ్లు మైదానంలోని అంపైర్లని డిమాండ్ చేశారు.
ఫీల్డ్ అంపైర్లు వారి అభ్యర్థని తిరస్కరించడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ డగౌట్ నుంచి మైదానంలోని ఆటగాళ్లను మ్యాచ్ నిలిపివేసి వచ్చేయాలంటూ సైగలు చేస్తూ పిలిచాడు. అప్పటికి 4 బంతుల్లో బంగ్లా 12 పరుగులు చేయాల్సి ఉంది. కెప్టెన్ సూచన మేరకు క్రీజులో ఉన్న మహ్మదుల్లా, రుబెల్ మైదానం వెలుపలకి వచ్చేసేందుకు ప్రయత్నించగా.. అంపైర్లు వారికి సర్దిచెప్పారు.
మరోవైపు కెప్టెన్కి బంగ్లాదేశ్ కోచ్, జట్టు మేనేజర్ ఖాలెద్ మెహమూద్ చొరవతో ఆటగాళ్లు బ్యాటింగ్ కొనసాగించారు. ఇలా అత్యుత్సాహం ప్రదర్శించిన అతనిపై ఐసీసీ చర్యలు తీసుకుంది. మరోవైపు రిజర్వ్ ప్లేయర్ నూరుల్ మైదానంలోకి వెళ్లి ప్రత్యర్థి జట్టు కెప్టెన్ తిసార పెరీరాపైకి వేలును చూపిస్తూ అతనితో వాగ్వాదానికి దిగన నేపథ్యంలో అతనిపై కూడా జరిమానా విధించారు.
ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయం సాధించడంతో మైదానంలో సంబరాలతో హోరెత్తించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత లంకను రెచ్చగొట్టేరీతిలో బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేశారు. ఇది ఏమాత్రం నచ్చిన శ్రీలంక జట్టులోని ఆటగాళ్లు కొందరు బంగ్లా ప్లేయర్లతో గొవడకు దిగేందుకు సిద్ధపడ్డారు. మ్యాచ్ పూర్తైన తర్వాత బంగ్లా డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి.