న్యూఢిల్లీ: కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన షాహిద్ అఫ్రిదిపై ఇప్పటికే యావత్ భారతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా బాధితుల సాయం పేరిట పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించిన ఈ పాక్ మాజీ క్రికెటర్.. అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ భారత్పై తనుకున్న విద్వేశాన్ని చాటుకున్నాడు.
భారత్కు వ్యతిరేకంగా విషం చిమ్మడమే కాకుండా.. కశ్మీర్ జట్టును పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడటానికి అనుమతి ఇవ్వాలంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి విజ్ఞప్తి చేశాడు. కశ్మీర్ పేరిటి ఓ ఫ్రాంచైజీని తీసుకురావాలన్నాడు. వచ్చే సీజన్ నాటికే కశ్మీర్ టీమ్ ఏర్పాటుకు కృషి చేయాలన్నాడు. అలా చేస్తే ఆ జట్టుకు తానే సారథ్యం వహిస్తానని చెప్పుకొచ్చాడు.
'పీసీబీకి ఇదే నా విన్నపం. తదుపరి పీఎస్ఎల్లో కశ్మీర్ పేరిట ఒక ఫ్రాంచైజీని ఏర్పాటు చేయండి. ఆ జట్టుకు నేనే సారథిగా వ్యహరించి పీఎస్ఎల్కు వీడ్కోలు చెబుతా. కశ్మీర్ జట్టుకు సారథిగా చేసే అవకాశాన్ని నేనే ఉపయోగించుకుంటా. కచ్చితంగా పీఎస్ఎల్లో కశ్మీర్ జట్టు ఉండాల్సిందే' అంటూ పీసీబీని డిమాండ్ చేశాడు. అదే సమయంలో కశ్మీర్లకు ఒక స్టేడియం, ఒక అకాడమీని కూడా ఏర్పాటు చేయాలన్నాడు. దీనికి తాను కరాచీ నుండి వచ్చి సాయం చేస్తానన్నాడు.
ఇక్కడ దాదాపు 125 క్రికెట్ క్లబ్లు ఉన్నట్లు విన్నానని, వీటి మధ్య టోర్నమెంట్లు నిర్వహించే దిశగా ఏర్పాట్లు కూడా చేయాలని కూడా సూచించాడు. కశ్మీర్లో మ్యాచ్లు చూడటానికి సంతోషంగా ఇక్కడకి వస్తానని, నాణ్యమైన ఆటగాళ్లను గుర్తించి తనతో పాటు కరాచీకి తీసుకువెళ్తానన్నాడు. వారంతా తనతోపాటు ఉండవచ్చని, వారికి ప్రాక్టీస్తో పాటు విద్య కూడా తానే అందిస్తానని భరోసా ఇచ్చాడు. ఇక ఇప్పటికే అఫ్రిది వ్యాఖ్యలను భారత క్రికెటర్లు తిప్పికొట్టిన విషయం తెలిసిందే. కశ్మీర్ ఎప్పుడూ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు.
టికెట్ తీసుకోకుండా కండక్టర్కు అలా చెప్పి అడ్డంగా బుక్కయ్యా: కోహ్లీ