లాహోర్: భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఉత్కంటే. దాయాదుల మధ్య సమరం ఓ యుద్ధంలా సాగుతుంటుంది. అప్పటి నుంచి నేటివరకు కూడా ఈ వైరం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే.. కార్గిల్ యుద్ధం తర్వాత భారత్ మూడు టెస్టుల సిరీస్ కోసం 2004లో దాయాది దేశంలో పర్యటించగా.. అప్పుడు వీరేందర్ సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఆ సిరీస్లోనే సెహ్వాగ్ తొలి టెస్టులో ట్రిపుల్ సెంచరీ చేసాడు.
'ధోనీ అందరిలాంటి కెప్టెన్ కాదు.. ఇది చెయ్ అది చెయ్ అని చెప్పడు'
ఆ తర్వాత భారత జట్టు 2006లో మరోసారి మూడు టెస్టుల సిరీస్ కోసం పాక్ పర్యటనకు వెళ్లింది. రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని భారత జట్టు 0-1తో సిరీస్ కోల్పోయింది. అయినా సరే లాహోర్లో టెస్టు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే.. ఆ మ్యాచ్లో సెహ్వాగ్, ద్రవిడ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా బరిలోకి దిగి పాక్ బౌలర్లకు చుక్కలు చూపెట్టారు. ఫ్లాట్ వికెట్పై రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి పాక్ బౌలర్లను చిత్తు చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పాక్ బౌలర్లు జోక్లేసుకోడానికే సరిపోయారు.
తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ మ్యాచ్కు సంబంధించిన ఓ ఫొటోను ట్వీట్ చేసి.. ఇదెప్పటి ఫొటోనో గుర్తుపట్టండని అభిమానులను అడిగింది. ఆ ఫొటోలో అప్పటి పాక్ బౌలర్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ నవ్వుతూ కనిపించారు. దాన్ని చూసిన అఫ్రిది స్పందించాడు. అది 2006 నాటి భారత్ పర్యటన సందర్భంగా లాహోర్ టెస్టులో తీసిన చిత్రం అని ట్వీట్ చేసాడు. అంతేకాదు అప్పటి సంగతులను నెమరువేసుకున్నాడు.
'అద్భుతమైన జ్ఞాపకాలు. ఇది 2006లో భారత్ పర్యటనలో నాకెంతో ఇష్టమైన లాహోర్ టెస్టు ఇన్నింగ్స్ తర్వాత తీసిన ఫొటో. ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు అక్తర్ ఎప్పుడూ చెమటలు పట్టిస్తాడు. కానీ అది ఫ్లాట్ వికెట్ అవడంతో ఏమీ చేయలేకపోయాం. అక్తర్ ఒక్కడే కాదు.. అందరం నిస్సాయులం అయ్యాం. ఒక్కోసారి అసహనానికి గురయ్యాం. అయితే మా బాధను మర్చిపోడానికి జోక్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది' అని అఫ్రిది రాసుకొచ్చాడు.
ఆ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ఏడు వికెట్ల నష్టానికి 679 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. యూనిస్ ఖాన్ (199), మహ్మద్ యూసుఫ్ (173), షాహిద్ అఫ్రిది (103), కమ్రన్ అక్మల్ (102) సెంచరీలు చేసారు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించగా.. సెహ్వాగ్ (254), ద్రవిడ్ (128) ఓపెనర్లుగా దిగారు. వీరిద్దరూ తొలి వికెట్కు 410 పరుగులు జోడించి ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నారు. చివరికి సెహ్వాగ్ ద్విశతకం తర్వాత ఔటయ్యాక లక్ష్మణ్ (0) క్రీజులోకి వచ్చాడు. అయితే కాసేపటికే వర్షం కురవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Great memories, this was I believe after one of my favourite Test inns in Lahore against India in 2006, Shoaib was always a threat for batsmen but this was a very flat wicket and bowlers were left to share jokes to overcome their pain 😂 https://t.co/9kTCuH4pYU
— Shahid Afridi (@SAfridiOfficial) May 29, 2020